వీడియో: నోరు విప్పిన కల్కి భగవాన్: చెన్నైలో ఉంటున్నాం..మరింత శక్తిమంతులమౌతాం!
చిత్తూరు: అయిదు రోజుల పాటు తమ ఆశ్రమాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేయడం, అక్కడ అక్రమంగా దాచి ఉంచి వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవడం.. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు ఎట్టకేలకు నోరు విప్పారు. 3 నిమిషాల 14 సెకెన్ల పాటు ఉన్న ఓ వీడియోను మంగళవారం ఆయన అమ్మ భగవాన్ పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన ఆ వీడియోలో కనిపించారు. ఐటీ దాడులపై స్పందించారు.
మేమెక్కడికీ పారిపోలేదు..
ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులకు భయపడి తాము దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వచ్చాయని, తాము ఎక్కడికీ పారిపోలేదని ఆయన వివరించారు. తాము దేశం విడిచి వెళ్లలేదంటూ ప్రారంభించారు. చెన్నై శివార్లలోని నేమమ్ ఆశ్రమంలో ఉంటున్నామని తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను తాము గమనిస్తున్నామని చెప్పారు. దాడులు ముగిసిన తరువాత స్పందించాలనే ఉద్దేశంతోనే తాము ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని అన్నారు. దేశం విడిచి పారిపోయామని, తమపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.

ఆరోగ్యంగా ఉన్నాం.. మరింత శక్తిని పుంజుకుంటాం
కల్కి భగవాన్ దంపతులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ నేమమ్ సహా తమకు చెందిన అన్ని ఆశ్రమాలకు భక్తులు ఫోన్లు చేస్తున్నారని, తమ ఆరోగ్యంపై కలత చెందవద్దని అన్నారు. తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని చెప్పారు. ఆశ్రమ కార్యకలాపాల గురించి భక్తుల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. ఆశ్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి సందేహాలకు అవకాశమే లేదని కల్కి భగవాన్ చెప్పుకొచ్చారు. తమను, ఆశ్రమాలను నమ్ముకున్న భక్తులకు ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. దేశ, విదేశాల్లో వేలాదిమంది భక్తులు తమకు ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications