వైజాగ్ షూటింగ్స్ - సెల్వమణి కామెంట్స్ పై రోజా క్లారిటీ-సమర్ధన ప్లస్ టీడీపీ వక్రీకరణ అంటూ
ఏపీలో కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన వైజాగ్ లో తమిళ హీరోల షూటింగ్స్ పై దర్శకుడు, మంత్రి రోజా భర్త సెల్వమణి లేవనెత్తిన అభ్యంతరాలు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు, చిత్తూరును వదులుకుని వైజాగ్ కు వెళ్లడమేంటని ఆయన వేసిన ప్రశ్న తన భార్య రోజా మంత్రిగా ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో సెల్వమణి వ్యాఖ్యలపై రోజా నోరు విప్పాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైజాగ్ వెళ్లిన మంత్రి రోజా దీనిపై స్పందించారు.
వైజాగ్ లో షూటింగ్స్ పై తన భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి రోజా స్పందించారు. తన భర్త సెల్వమణి ఏ రాష్ట్రంలో షూటింగ్లో ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంటుందని మాత్రమే చెప్పారని మంత్రి రోజా ఆయన వ్యాఖ్యల్ని సమర్ధించారు. కానీ విపక్ష టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో షూటింగ్లో జరిగితే ఆ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి అని తన భర్త చెప్పడం తప్పా అని రోజా ప్రశ్నించారు.
మరోవైపు విజయమ్మ, షర్మిలపై విమర్శలు చేసే వారిని రోజా టార్గెట్ చేయడంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపైనా రోజా స్పందించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు అక్క అమ్మ, చెల్లి ఎవరూ లేరా అని సూటిగా ప్రశ్నించారు. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే నీకు బాధగా ఉండదా అని ప్రశ్నించారు. ఇవాళ విశాఖ చేరుకున్న ఆర్కేరోజాకు విమానాశ్రయం లో వైసీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఆ తర్వాత నోవాటెల్ కు రోజా బయలుదేరారు.
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అధికారం లేదు ఇంక రాదు అని అక్కసుతో పిచ్చిపిచ్చిగా చంద్రబాబు మాట్లాడుతున్నాడని రోజా ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అని అక్కడ ఉన్న యువత అనడంతో అక్కడి నుంచి పక్కకు జారుకున్నారని రోజా వ్యాఖ్యనించారు. 2024 లో చంద్రబాబు నాయుడు కు బాదుడే బాదుడు తప్పదన్నారు. ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక పొత్తులపై ఆరాటపడుతున్నారని రోజా ఆరోపించారు. నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావ్ అంటూ చంద్రబాబును రోజా ప్రశ్నించారు.
నువ్వు నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని రాబందుల్లా తిన్నారని, అన్న క్యాంటిన్లు నుంచి అమరావతి వరకు చిన్న పిల్లల కోడి గుడ్లు దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంటల వరకు దోచుకున్నది మీరేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును క్విట్ చేయాలన్నారు. అధికారం కోసం ఆరాటం, డ్వాక్రా మహిళల ను మోసం చేసావని రోజా పేర్కొన్నారు. జగన్ పై యుద్ధం చేసే నీకు నీ కొడుకుకు దమ్ము ఉందా అని రోజా ప్రశ్నించారు. నారాయణ కాలేజ్ లో పేపర్ లీకు చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.