సీఎం జగన్ పాలనపై కేవీపీ కీలక వ్యాఖ్యలు - వైఎస్ తో అలా ఒట్టు పెట్టుకున్నాం..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన పైన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ ఆత్మబంధువుగా పేరున్న కేవీపీ..ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం పైన ఎక్కడా నేరుగా విమర్శలు చేయలేదు. వైఎస్సార్ మరణం తరువాత కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తరువాత కాలంలో సీఎంను కలవలేదు. అదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్దంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పీసీసీ చీఫ్..కొత్త కమిటీలను ఏర్పాటు చేసిన ఏఐసీసీ కేవీపీకి కీలక బాధ్యతలు అప్పగించింది.
పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోంది..
ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు.
ఏపీకి నాడు రాజ్యసభ వేదికగా ఇచ్చిన హామీ సాధన దిశగా ప్రయత్నం జరగటం లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం దుస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. పోలవరం కేంద్రమే నిర్మించాలని చట్టం లో ఉన్నా..నాడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్మాణ బాధ్యతలు తీసుకోవటం సరి కాదని వ్యాఖ్యానించారు.
పోలవరం - విశాఖ స్టీల్ కీలకమైనా
పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లటం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం సిద్దపడిందన్నారు. అయినా, అడ్డుకొనే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేనద వ్యక్తం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేసారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, రాహుల్ ను ప్రధాని చేయటం ఆ రెండు లక్ష్యాలుగా కేవీపీ గుర్తు చేసారు.
ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే 2024 లో కాకపోయినా..2029 నాటికికైనా కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని కేవీపీ చెప్పుకొచ్చారు. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు.
వైఎస్ తో కలిసి అలా ఒట్టు పెట్టుకున్నాం
ఇదే సమయంలో కేవీపీ కొన్న ఆసక్తి కర అంశాలను బయట పెట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డికి, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని కేవీపీ గుర్తు చేసారు. 1978 నుంచి అనేక పదవులు కట్టబెట్టిందని చెప్పుకొచ్చారు. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదనేది తమ విధానంగా ఉండేదన్నారు.
పార్టీ అధినాయకత్వాన్ని పల్లెత్తుమాట అనకూడదని 1996లోనే రాజశేఖర్రెడ్డి, తానూ ఒట్టేసుకున్నామని కేవీపీ చెప్పారు. తాను చివరిదాకా కాంగ్రె్సతోనే ఉంటానని కేవీపీ రామచంద్రరావు పార్టీ సమావేశంలో స్పష్టం చేసారు. ఇక, కొత్తగా ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు రాష్ట్రంలో పాదయాత్రకు సిద్దం అవుతున్నారు.