ఏపీ సీఎం చంద్రబాబు ఓఎస్డీగా తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్
అమరావతి: తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తేలప్రోలు శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పోస్టులో నియమించారు. ఇంతకీ ఏంటా? కీలక పోస్టు అనుకుంటున్నారా? ఏపీ సీఎం చంద్రబాబుకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నియమితులయ్యారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాసరావు ఏపీ సీఎంకు ఢిల్లీలో ఓఎస్డీ(మీడియా సంబంధాలు)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీనివాసరావు ఢిల్లీలో ఏపీకి సంబంధించిన మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. కాగా కాంట్రాక్ట్ పద్దతిన నియమితులైన శ్రీనివాసరావు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ మీడియాలో ప్రచారం చేసేందుకు తేలప్రోలు నియామకం జరిగింది.

స్మార్ట్ సిటీల జాబితాలో అమరావతి
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగరాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలోని మిగతా నగరాలతో పోటీ పడి విజేతగా నిలిస్తేనే అమరావతి స్మార్ట్ సిటీగా ఎంపికవుతుంది.
స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలు రెండో జాబితాను మంగళవారం వెంకయ్య నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి వరంగల్ స్మార్ట్ సిటీగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ నగరాలు స్మార్ట్ నగరాలుగా ఎంపికయ్యాయి.
కాగా, ప్రస్తుతం తిరుపతి స్మార్ట్ సిటీ నగరాల పోటీలో ఉంది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ 2015-16 స్మార్ట్ నగరాల జాబితాను ప్రకటించామని, ఈ ఏడాది మరో 40 నగరాలను ప్రకటించనున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications