జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి- ఎయిడెడ్ పై వరుస ఎదురుదెబ్బలు-హైకోర్టు మరో కీలక ఆదేశం
ఏపీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలోకి విలీనం చేయాలని, అలాగే వాటి ఆస్తులు, సిబ్బందిని కూడా స్వాధీనం చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇస్తోంది. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనంతో పాటు వాటికి జారీ చేస్తున్న హెచ్చరికలపైనా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఇవాళ మరో కీలక ఆదేశం ఇచ్చింది.
ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనం
ఏపీలో ఉన్న వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించిన వైసీపీ సర్కార్ గతంలో ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది. దీంతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖాధికారులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్ధలపై వేధింపులు మొదలయ్యాయి. విద్యాసంస్ధల్ని ప్రభుత్వానికి అప్పగిస్తారా లేక గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపేయమంటారా అంటూ హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎయిడెడ్ విద్యాసంస్ధలు బెంబేలెత్తాయి.
హైకోర్టులో వరుస పిటిషన్లు
ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేదంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపేస్తామంటూ వైసీపీ సర్కార్ చేస్తున్న హెచ్చరికలపై ఆయా సంస్ధలుప హైకోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ హెచ్చరికలతో విద్యాసంస్ధలు నడపలేని పరిస్ధితి ఉందంటూ వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రభుత్వ న్యాయవాదిని ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఏ నిబంధనల ప్రకారం ఎయిడెడ్ విద్యాసంస్ధల స్వాధీనం కోసం ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో సర్కార్ ఇరుకునపడింది.
స్వచ్ఛంద విలీనమేనన్న ప్రభుత్వం
ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న నిర్ణయం స్వచ్ఛందమేనని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. అయితే ఓవైపు విలీనం చేయాల్సిందేనని జీవో ఇచ్చి, మరోవైపు స్వచ్ఛంద విలీనమని చెప్పడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడిని హైకోర్టుకు రప్పించి ఆయన వివరణ కోరింది. దీంతో ఆయన కూడా చివరికి ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని స్వచ్చంధంగానే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టుకు కీలక హామీ ఇచ్చారు.
ఎయిడ్ నిలిపివేత బెదిరింపులు
మరోవైపు ప్రభుత్వంలో స్వచ్చంధంగానే ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని విలీనం చేసుకుంటామని హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం.. మరోవైపు విలీనం చేయకపోతే వారికి ఇప్పటివరకూ ఇస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపేస్తామని హెచ్చరికలు మొదలుపెట్టింది. దీంతో మరోసారి విద్యాసంస్ధలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో మళ్లీ హైకోర్టు జోక్యం చేసుకుని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విలీనానికి అంగీకారం ఇవ్వలేదని, ఏ ఎయిడెడ్ పాఠశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరూప్ గోస్వామి ఆధ్వర్యంలోని ధర్మాసనం. ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టులో కేసు ఉన్నంత వరకు ఎయిడెడ్ పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కమిషనర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్ నుంచి ఆర్జేడీలు, డీఈలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరూప్ గోస్వామి. ఆదేశాలు ఇచ్చారు.
జగన్ సర్కార్ కు మరిన్ని కష్టాలు
ఇంతటితో ఎయిడెడ్ విద్యాసంస్ధల వివాదం ముగిసేలా లేదు. పలు పాఠశాలలు పెద్ద సంఖ్యలో పిటీషన్లు దాఖలు చేయడం తో ఈ వ్యవహరంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ధర్మాసనం ఎదుట హజరై ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హామీ ఇచ్చిన విషయం ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేసినా ధర్మాసనం శాంతించలేదు.
విల్లింగ్ పేరుతో ఎటువంటి చర్యలు కూడా తీసుకోబోమని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. దీంతో ఈ నెల 28వ తేదీకి కేసు వాయిదా వేసిన ధర్మాసనం. 22వ తేదీలోగాఈ కేసుల్లో కౌంటర్లు వేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఓవైపు హైకోర్టుకు హామీలు ఇస్తూనే మరోవైపు ఎయిడెడ్ స్కూళ్లను బెదిరిస్తున్న విద్యాశాఖాధికారుల వ్యవహారంపై హైకోర్టు పూర్తిస్దాయి విచారణ చేపడితే జగన్ సర్కార్ కు కష్టాలు తప్పకపోవచ్చు..