ఏపీలో విచిత్ర పరిస్ధితి-పనులిస్తామన్నా కాంట్రాక్టర్లు వెనక్కి-తాజాగా బందరు పోర్టు టెండర్ల రద్దు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా కాంట్రాక్టర్లలో సర్కార్ పై నమ్మకం సడలిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా గతంలో పోటీ పడిన కాంట్రాక్టర్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు బతిమాలుతున్నా టెండర్లు వేసేందుకు సిద్ధపడటం లేదు. గతంలో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వాల హయాంలో హవా కొనసాగించిన కాంట్రాక్టర్లు తాజాగా ఏ పనికీ ముందుకు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణం కోసం వరుసగా రెండోసారి పిలిచిన టెండర్లూ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
సర్కారీ పనుల దుస్ధితి
ఏపీలో గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంట్రాక్టర్లు మాత్రం ఉమ్మడిగా పనులు చేసుకునే వారు. విపక్ష పార్టీలకు చెందిన కాంట్రాక్టర్లు కూడా అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వ పనులు దక్కించుకునే వారు. అళాగే బిల్లులు కూడా ఎక్కడా ఆగకుండా చెల్లింపులు జరిగేవి. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్ధితి మారిపోయింది.
ప్రభుత్వంలో పనులు దక్కించుకునేందుకు ఎక్కడా పోటీ పడే పరిస్దితులు కనిపించడం లేదు. గతంలోలా ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల కోసం లాబీయింగ్ కనిపించడం లేదు. చివరికి ఒకరిద్దరు కూడా పోటీ పడని పరిస్దితుల్లో ప్రభుత్వం పనులు రద్దు చేసుకోవాల్సిన దుస్దితి దాపురిస్తోంది.
బిల్లుల దెబ్బతో విలవిల
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లు .. ఈసారి పార్టీలకతీతంగా నష్టపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి డబ్బులు అందుతాయని భావించినా ఎక్కడా బిల్లుల చెల్లింపు జరగకుండా బ్రేకులు పడ్డాయి. దీంతో వీరు కోర్టుల్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఏం చేయాలో తెలియక కాంట్రాక్టర్లు విలవిల్లాడటం మొదలైంది. చివరికి కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్లపై పడే పరిస్ధితులు వచ్చేశాయి. అప్పటివరకూ దర్జాగా బతికిన కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి బిల్లులు రాక వందల సంఖ్యలో కుదేలయ్యారు. ఇక మరోసారి ప్రభుత్వ పని పేరు చెబితేనే బెంబేలెత్తే పరిస్ధితి.
ప్రభుత్వానికి మొహం చాటేసి
ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు వచ్చే పరిస్దితి ఎప్పుడూ లేదు. కనీసం పనులు పూర్తయిన ఆరునెలలకో, ఏడాదికో బిల్లులు వస్తే అదే మహాభాగ్యం అనుకునే పరిస్దితుల్లో ఈసారి మాత్రం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్దితి వచ్చేసింది. దీంతో కాంట్రాక్టర్లు మరో పని తీసుకునేందుకు ముందుకు రాని పరిస్దితి. పని పూర్తి చేసినా బిల్లులు వస్తాయో రావో తెలియకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి మొహం చాటేయడం మొదలుపెట్టేసారు. దీని ప్రభావం పలు రోడ్డు కాంట్రాక్టులతో పాటు ప్రభుత్వ పనులు, అభివృద్ధి పనులపైనా పడింది. చివరికి ఈ వ్యవహారం బందరు పోర్టు వంటి పెద్ద ప్రాజెక్టుపైనా పడింది.
బందరు పోర్టు టెండర్లకు జీరో స్పందన
బందరు పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో టెండర్లు పిలిచింది. వేల కోట్ల ఖర్చుతో చేపట్టే పనులు కావడంతో రాష్ట్ర, అంతర్ రాష్ట్ర కాంట్రాక్టర్లు ఎలాగోలా ముందుకొస్తారని ఆశించింది. కానీ అలా జరగలేదు. తొలిసారి వేల కోట్ల పనులకు కాంట్రాక్టర్లు ఏపీలో మొహం చాటేశారు. పరిస్దితి గమనించి ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లు కూడా దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టెండర్ల నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసినా పరిస్దితిలో మార్పు లేదు.
తొలిసారి బందరు పోర్టు టెండర్లు స్పందన లేక రద్దయ్యాయి. ఆ తర్వాత మరోసారి అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది నాలుగుసార్లు గడువు పెంచినా ఫలితం లేదు. ఫలితంగా రెండోసారి కూడా బందరు పోర్టు టెండర్లు స్పందన లేక రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురైంది.
ఇలాగైతే కష్టమే
ఇదే పరిస్ధితి కొనసాగితే రాష్ట్రంలో భవిష్యత్తులో చేపట్టబోయే పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్నా చితకా పనుల విషయంలోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టర్లలో భరోసా కల్పించేందుకు పలుమార్లు చర్చిస్తున్నా ఫలితాలు మాత్రం కానరావడం లేదు. దీంతో అధికారులు మరిన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అసలే రోడ్ల పనులతో పాటు ఏపీలో పలు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ముందుకు సాగాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఆ మేరకు కాంట్రాక్టర్లలో భరోసా కల్పిస్తే తప్ప పరిస్దితులు మారేలా కనిపించడం లేదు.