అమరాతి పాదయాత్రకు హైకోర్టు రూల్స్- 600 మందికే ఛాన్స్-4 వాహనాలు-ఉల్లంఘిస్తే చర్యలు..
అమరావతి రాజధాని కోసం రైతులు అరసవిల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పాదయాత్రలో రైతులు గతంలో అనుమతి ఇచ్చిన సందర్బంగా విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమరావతి రైతుల పాదయాత్ర ఎలా సాగాలన్న విషయంలో హైకోర్టు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం యాత్రలో కేవలం 600 మందే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతి ఉన్నవాళ్లు మాత్రమే పాల్గొనాలని పేర్కొంది. సంఘీభావం తెలిపేవారు రోడ్డు పక్కనే ఉండాలని తెలిపింది. పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలు మాత్రమే వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని కూడా హైకోర్టు తెలిపింది. మొత్తంగా నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
హైకోర్టు విధించిన నిబంధను పాటించడంలో విఫలమైతే మాత్రం అమరావతి పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తప్పవని న్యాయస్ధానం స్పష్టం చేసింది. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాదయాత్రను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.