జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్- ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ కొట్టివేత
ఏపీ హైకోర్టులో వైసీపీ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో కరోనా సమయంలో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు చేపట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి గండిపడింది. ఆన్ లైన్ అడ్మిషన్లపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది ఇంటర్ మీడియట్ అడ్మిషన్ల కోసం ఏపీ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియెట్లో ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్లైన్ ప్రవేశాలు ఉంటాయని, ఇందులో రిజర్వేషన్లు కూడా వర్తించేలా నోటిఫికేషన్ లో పేర్కొంది. దీని ప్రకారం ఆన్ లైన్ లోనే అడ్మిషన్లు చేపట్టాలని, నేరుగా అడ్మిషన్లు చెల్లవని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఆన్ లైన్ అడ్మిషన్లు చేపట్టకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఆన్ లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టేసింది.
ఇంటర్ అడ్మిషన్ల పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు... ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆన్లైన్లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది. ఈ విద్యా సంవత్సరానికి మాత్రం గతంలోలాగే అడ్మిషన్లు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఆన్ లైన్ అడ్మిషన్ల నిర్ణయం చెల్లుబాటు కాకుండా పోయింది. ప్రభుత్వం అనవసరంగా పట్టుదలకు పోవడంతో హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.