జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ- పురపాలికల్లో విలీన గ్రామాల్లో ఎన్నికలపై స్టే
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్ధానిక సంస్ధల్లో విలీనం చేసిన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలా విలీనమైన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. దీంతో పాటు విలీనంపై దాఖలైన పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తాజాగా పలు పట్టణ స్ధానిక సంస్ధలైన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో సమీపంలోని గ్రామాల్ని విలీనం చేస్తూ చట్ట సవరణ చేయడంతో పాటు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తద్వారా వీటిలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని భావిస్తున్న తరుణంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తమ గ్రామాల్ని పట్టణ స్ధానిక సంస్ధల్లో విలీనం చేయడం ద్వారా పన్నులు పెరగడం మినహా అభివృద్ధి సాధ్యం కాదని ఆరోపిస్తూ 46 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ ప్రారంభించింది.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో గ్రామాల విలీనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ, తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై విచారణకు హైకోర్టు సిద్ధమైంది. మూడు వారాల్లో ఈ వ్యవహారంపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
దీంతో ఈ మూడు వారాల పాటు ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విలీనం పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు విచారణ తర్వాత తీసుకోబోయే నిర్ణయం ఆధారంగానే అక్కడ ఎన్నికలు ఉంటాయి.