గన్నవరం ఎయిర్ పోర్టులో రఘురామకు షాక్! జై జగన్ నినాదాలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా సాగిన ఎపిసోడ్ ఐదేళ్ల పాటు చూశాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే, జగన్ అదే వైసీపీ అధినేత. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రఘురామకూ, వైసీపీకీ మధ్య వార్ ను సజీవంగానే ఉంచుతున్నాయని మరోమారు రుజువైంది. గన్నవరం ఎయిర్ పోర్టు ఇందుకు వేదికైంది. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రఘురామకు అక్కడ షాక్ తప్పలేదు.
ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తున్న రఘురామకు అక్కడే ఉన్న వైసీపీ క్యాడర్ షాకిచ్చారు. రఘురామను చూడగానే వారు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రఘురామ కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. దీంతో వారు వెంటపడి మరీ నినాదాలు చేశారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రఘురామ రోడ్డు మార్గంలో భీమవరం బయలుదేరి వెళ్లిపోయారు.

గతంలో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు.. జగన్ తో విభేదించారు. దీంతో వైసీపీ సర్కార్ ఆయన్ను పూర్తి స్ధాయిలో టార్గెట్ చేసింది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై సీఐడీ కేసు నమోదు చేయడమే కాకుండా కస్టడీలోకి తీసుకుని ఆయనపై పోలీసులు దాడి చేశారు. దీన్ని ఆ తర్వాత కోర్టు నియమించిన మెడికల్ కమిటీ నిర్దారించింది. ఆ తర్వాత రఘురామ బెయిల్ పై బయటికి వచ్చారు. ఆయనపై అనర్హత వేటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన వైసీపీ విఫలమైంది. ఐదేళ్లు ఇలా పూర్తి చేసుకున్న రఘురామ టీడీపీలోకి వెళ్లి ఉండిలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా వీరి మధ్య పాత కక్షలు అలాగే ఉండిపోయాయి.












Click it and Unblock the Notifications