మొన్న అధినేతలకు-ఇప్పుడు ఎమ్మెల్యేలకు-పరిషత్ ఎన్నికల షాకులు-10 చోట్ల విపక్షాల హవా
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగినట్లు పైకి కనిపించినా.. అంతర్గతంగా మాత్రం ఆ పార్టీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ సత్తా చాటుకోలేని పరిస్ధితి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్ధితి అదే. దీంతో పరిషత్ పోరులో అధినేతలకు షాక్ తప్పలేదని తేలిపోయింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల్లో అయితే అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు షాకులు తప్పడం లేదు. అదే సమయంలో విపక్షాలు కూడా క్రమంగా దగ్గరవుతున్నాయి. దీంతో వైసీపీలో ఆందోళన పెరుగుతోంది.
పరిషత్ పోరులో షాకులు
ఏపీలో తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ కు తాను నివాసం ఉంటున్న తాడేపల్లి ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిన భీమవరంలోనూ ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇక్కడ మెజారిటీ ఎంపీటీసీ స్ధానాల్ని వారి ప్రత్యర్ధులు చేజిక్కించుకున్నారు. కుప్పం, భీమవరంలో వైసీపీ హవా కొనసాగగా.. మంగళగిరిలో మాత్రం టీడీపీ హవా కొనసాగింది. దీంతో రాష్ట్రమంతా పార్టీని విజయవథంలో నడిపిన జగన్ తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సొంత ప్రాంతాల్లో చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పలేదు.
ఎంపీపీ ఎన్నికల్లోనూ
పరిషత్ ఫలితాల్లో అధినేతలకు ఎదురుదెబ్బలు తగలగా... తాజాగా నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నిక్లలోనూ పార్టీలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బలు తప్పలేదు. ముఖ్యంగా అధికార వైసీపీకి కనీసం 10 చోట్ల ప్రతికూల పరిస్ధితులు ఎదురయ్యాయి. దీంతో అధికారంలో ఉండి కూడా సొంత పార్టీని గట్టెక్కించుకోలేకపోయారన్న అపప్రద ఎదుర్కోవాల్సి వస్తోంది. పలు చోట్ల విపక్షాలు కలిసి కట్టుగా పనిచేసి అధికార పార్టీకి చుక్కలు చూపించిన పరిస్ధితి కూడా కనిపించింది. దీంతో అధికార పార్టీకి విపక్షాల సెగ తప్పలేదు. మరికొన్ని చోట్ల విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్ని వాయిదా వేయించడం కూడా ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పలు చోట్ల అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతికూల పరిస్ధితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా స్ధానికంగా అధికార పార్టీ అయినప్పటికీ పరిషత్ ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పటికీ పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని గట్టెక్కించలేకపోయారు. ఇందులో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఇంకా మరికొందరు ఉన్నారు. దీంతో ఆయా ఫలితాలు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు గండంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలియక ఎమ్మెల్యేలు మథన పడుతున్న పరిస్ధితి. సొంత నియోజకవర్గాల్లోనూ వైసీపీని గట్టెక్కించలేని తమకు తిరిగి ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయో లేదో అని ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోంది.
విపక్షాల ఐక్యత
ఎంపీపీ ఎన్నికల్లో పలు చోట్ల అధికార పార్టీకి ఎదురుదెబ్బలు తగలగడం వెనుక విపక్షాల ఐక్యత ప్రధాన కారణంగా కనిపించింది. ఇందులోనూ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ, పోటీ చేసి సత్తా చాటుకున్న జనసేన, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు ఇక్కడ కీలక పాత్ర పోషించాయి. పరిషత్ ఫలితాల్లో అధికార పార్టీతో పోటీ పడలేకపోయన వీరంతా ఇప్పుడు ఐక్యతారాగాలు వినిపిస్తున్నారు. దీంతో చాలా చోట్ల వైసీపీ ఆధిపత్యం ఉన్న చోట కూడా ఎదురుదెబ్బలు తప్పకపోవడానికి వీరి ఐక్యతే కారణమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, కడియం, శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల ఈ పరిస్ధితి కనిపించింది. వైసీపీలో అసమ్మతి ఎంపీటీసీలకు టీడీపీ మద్దతివ్వడంతో పలుచోట్ల అధికార పార్టీ ఎంపీపీల్ని కోల్పోయింది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి నష్టపోయిన టీడీపీ, జనసేన మరోసారి కలిసి పోటీ చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి.
వైసీపీ కొంపముంచిన చీలికలు
రాష్ట్రంలో నిన్న జరిగిన పలు ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ చీలికలే ఆ పార్టీ కొంపముంచాయి. ఇందులో అరకులోని పెదబయలు, విజయనగరం జిల్లా వేపాడ, పాడేరులోని జి.మాడుగుల, నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని హిరమండలంలో అధికార ఎంపీటీసీల చీలికలు విపక్షాలకు విజయాల్ని కట్టబెట్టాయి. పలుచోట్ల అసమ్మతి ఎంపీటీసీలు గైర్హాజరు కావడం ద్వారా అధికార పార్టీని చికాకు పెట్టారు. దీంతో ఎన్నికలు వాయిదా పడక తప్పలేదు. అదే సమయంలో అధికార పార్టీలో అసమ్మతి స్వరాలు ఒక్కసారిగా బయటపడినట్లయింది. ఆయా చోట్ల అసమ్మతి ఎంపీటీసీలకు పార్టీ అధిష్టానం ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Recommended Video
వైసీపీకి మింగుడుపడని అంశాలివే..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తమ హవా కొనసాగించిన అధికార వైసీపీకి ఎంపీపీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పరిషత్ పోరులో తమను ఎదుర్కోలేక చేతులెత్తేసిన విపక్ష పార్టీలు.. ఎంపీపీ ఎన్నికలకు వచ్చేసరికి చేతులు కలపడం అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో సొంత పార్టీలో చీలికలు, అసమ్మతి కూడా ఒక్కసారిగా బయటపడటం వైసీపీకి మింగుడుపడటం లేదు. సొంత నేతల నిర్వాకాలతో పరిషత్ ఫలితాలకు భిన్నంగా పలు చోట్ల విపక్షాలు తాము గెల్చుకనే సీట్లను తన్నుకుపోవడంతో ఇప్పుడు ఆయా నియోజకకవర్గాలపై వైసీపీ కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. అన్నింటికీ మించి స్ధానిక కారణాలతో వైసీపీ అసమ్మతి నేతలు వైసీపీ పెద్దల్ని సైతం ధిక్కారించే పరిస్ధితులు రావడంపైనా అధికార పార్టీ కలవరపడుతోంది.