జగన్ పార్టీ నేత దారుణ హత్య: ఏడుగురి అరెస్టు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వసంతరావు దారుణ హత్య కేసును మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డిఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి వసంతరావు ఈనెల 15న ఉదయం సుండిపెంట నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఆ వెంటనే దుండగులు వసంతరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టి బయటకులాగి గడ్డపార, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని తెలిపారు. వసంతరావు ఆయన రాజకీయ ప్రత్యర్థులు కర్నూలు జిల్లా సుండిపెంటకు చెందిన వెంకట్రెడ్డి, రామసుబ్బారెడ్డి, నాగేశ్వర్రావు, కర్నూల్ జిల్లా ఆత్మకూరు సుంకేసుల గ్రామానికి చెందిన కొండ్రెడ్డి చిన్నయ్య, షాపొల్ల రుప్రాషా, చిన్న వెంకటేశ్, నల్గొండ జిల్లా మొత్కుపల్లి గురువయ్యలతోపాటు మరికొంతమంది వసంతరావుపై దాడి చేశారు.
రాజకీయ కక్షల కారణంగానే హత్య చేసినట్లు విచారణలో తేలింది. అచ్చంపేట సిఐ వెంకటేశ్వర్లు, సిద్దాపూర్ ఎస్సై చంద్రమోహన్రావు, ఈగలపెంట, అమ్రాబాద్ ఎస్సైలను ప్రత్యేక బృందంగా ఏర్పాటుచేసి హత్య కేసును ఛేదించారు. ప్రధాన నిందితుడు వెంకట్రెడ్డి రాజకీయ పార్టీలో ఉంటూ రాజకీయ కక్షలకు పాల్పడినట్లు తెలిపారు.
దుండగులు ఏడుగురు శనివారం ఉదయం కారులో వెళ్తుండగా మన్ననూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారని ఇన్చార్జి ఎస్పీ వెల్లడించారు. ప్రధాన ముద్దాయి వెంకట్రెడ్డి జనశక్తి పార్టీలో పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి రెండు పిస్తోళ్లు, ఒక రివాల్వర్, కత్తి, బుల్లెట్, సెల్ఫోన్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకొన్నారు.