కత్తి ఎందుకో చెప్పు: షబ్బీర్, కెసిఆర్పై టి కాంగ్రెస్ భగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. నవ తెలంగాణ నిర్మాణానికి కావాల్సింది కత్తి కాదని, కలం కావాలన్నారు. ఎవరిని చంపేందుకు కత్తి కావాలో చెప్పాలన్నారు. విభజన అనంతరం కొన్ని చిన్న సమస్యలు సాధారణమేనని, వాటి పరిష్కారానికి కత్తి కావాలనడం దారుణమన్నారు.
తన కూతురు కల్వకుంట్ల కవితకు లోకసభ టిక్కెట్ కేటాయించడం ద్వారానే తెరాస ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ అని తెలుస్తోందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు టిక్కెట్లు మొదట ప్రకటించి ఉంటే అందరు సంతోషించేవారన్నారు.
ప్రజలు గమనిస్తున్నారు: గండ్ర
కెసిఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత మభ్యపెట్టినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న కెసిఆర్ సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. కెసిఆర్ ఎన్ని చెప్పినా తెలంగాణ ఇచ్చిందెవరో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
కాంగ్రెస్, తెరాస రెండూ కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారని, కెసిఆర్ తీరు వల్ల అది సాధ్యం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఛాంపియన్ కాంగ్రెస్ అని, ఎన్నికల ఫలితాలతో ఆ విషయం రుజువు అవుతుందని చెప్పారు.
అభద్రతాభావం: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర సమితి ఆత్మవిశ్వాసం కోల్పోయిందని, అభద్రతా భావంలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుకే ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడిందన్నారు. సామాజిక న్యాయమా? కుటుంబపాలనా? అనే విషయం తేల్చుకునే దిశగా తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని చెప్పారు. కెసిఆర్ వలసలను ప్రోత్సహించడం దారుణమన్నారు.
కాగా, అంతకుముందు దానం నాగేందర్ మాట్లాడుతూ... తెరాసకు ఓటేస్తే రాబందులకు ఓటు వేసినట్లేనని ధ్వజమెత్తారు. కలెక్షన్ల కోసమే ఎన్నికలను కెసిఆర్ వినియోగించుకుంటారన్నారు.