అమరావతి తప్ప చంద్రబాబుకు ఏదీ పట్టడం లేదు: శైలజానాథ్
హైదరాబాద్/ అనంతపురం: రాజధాని ప్రాంతం తుళ్లూరును తప్ప జిల్లాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేశామని తెలిపారు.
ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బిజెపి నీచ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 9వ తేదీన కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అన్ని గ్రామాల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామని చెప్పారు. ప్రత్యేకహోదా కోసం 29న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ అన్నారు.
ఇదిలావుంటే రాజకీయ అవసరాల కోసమే రాయలసీమ ఉద్యమాన్ని రాజకీయ నేతలు చేస్తున్నారని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.
మేధావులంతా కూర్చుని సమస్యలపై చర్చించుకోవాలన్నారు. రాయలసీమ కోసం చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. దోపిడీ ప్రభుత్వాలపై యువత పోరాటం చేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు.