కిరణ్ రెడ్డి సర్కార్పై అవిశ్వాసానికి శంకరన్న నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అధికార కాంగ్రెసు పార్టీ సభ్యుడు, మాజీ మంత్రి పి. శంకరరావు నోటీసు ఇచ్చారు. శానససభ సచివాలయ కార్యదర్శి సదానందానికి ఆయన బుధవారం ఆ నోటీసు ఇచ్చారు. దానిపై చర్చించేందుకు వెంటనే శాసనసభా సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ముఖ్యమమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారని ఆయన తన లేఖలో అన్నారు. అధికార పార్టీ శానససభ్యుడై ఉండి శంకరరావు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకోవడమే కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ఒక్క సభ్యుడైనా నోటీసు ఇవ్వవచ్చు. కానీ అది శాసనసభలో చర్చకు రావాలంటే 30 మంది సభ్యుల మద్దతు అవసరం. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే సభ్యుల మద్దతు వస్తుందని శంకరరావు అన్నట్లు సమాచారం. నిజానికి, అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి.
తెలంగాణకు చెందిన పి. శంకరరావు చాలా కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విమర్శల కారణంగానే ఆయన మంత్రి పదవిని కూడా కోల్పోయారు. తెలంగాణ బిల్లు శాసనసభ ముందుకు వస్తుందని భావిస్తున్న తరుణంలో శంకరరావు ఇచ్చిన నోటీసు ఏ మలుపు తిప్పుతుందనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications