ప్రేయసి జాడ కోసం శరణ్య కిడ్నాప్: అప్పుడే విడిచిపెడ్తానని షరతు
విశాఖపట్నం: తన ప్రేయసి జాడ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాపను కిడ్నాప్ చేసిన యువకుడు చివరకు పోలీసులకు చిక్కాడు. శ్రీకాకుళం జిల్లా లావేరులో శరణ్య అనే పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి టోల్ గేట్ వద్ద కిడ్నాపర్ సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శరణ్యను సురేష్ ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా సమాచారం అందడంతో నక్కపల్లి పోలీసులు టోల్గేట్ వద్దకు చేరుకుని శరణ్యను రక్షించారు.
శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న శరణ్యను లంకలపల్లి సురేష్ కిడ్నాప్ చేశాడు. గతంలో సురేష్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అతనికి కనిపించకుండా పోయింది.
తన ప్రియురాలు కనిపించకపోవడానికి పార్వతి అనే మహిళ కారణమని భావించి పార్వతి మనువరాలు శరణ్యను కిడ్నాప్ చేశాడు. తన ప్రేయసి జాడ చెప్తే శరణ్యను విడిచిపెడతానని షరతు పెట్టాడు. దీంతో పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసిది. కేసు నమోదు చేసుకుని పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సురేష్ కోసం గాలించారు.