RRR:వైసీపీకి మేకు -జగన్కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ
40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ(39.17శాతం) కంటే పదిశాతానికి పైబడి(49.95శాతం) ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లు.. ఏకంగా 22 మంది ఎంపీలతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా ఘనత.. సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తోన్న ముఖ్యమంత్రిగా జగన్కు పార్టీ శ్రేణుల నీరాజనాలు.. అధికారం చేపట్టిన తర్వాత చాలా నెలల వరకు సీఎం మాటే శాసనం. కానీ ఒక్కరి తీరు మాత్రం పూర్తిగా రెటమతం. వైసీపీ నుంచి గెలిచిన తర్వాత కూడా తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీతో, పార్టీ పదవులిచ్చిన టీడీపీతో దగ్గరితనాన్ని పాటించిన నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు క్రమంగా అధినేతకు దూరమైపోయారు. సొంత పార్టీపై, సీఎం జగన్ పై అతి తీవ్రస్థాయిలో ధిక్కారస్వరం వినిపిస్తూ ఈ ఏడాదంతా రఘురామ సంచలన ఆరోపణల బాణాలు వేస్తూనే ఉన్నారు..
టిట్ ఫర్ టాట్: జగన్కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూ
తెలుగు భాషతో మొదలై..
పాదయాత్రలో చెప్పినట్లుగానే సీఎం జగన్ ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్యకు ఆదేశాలివ్వగా, గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘తెలుగు భాష'పై చర్చ సందర్భంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తొలిసారి సొంత పార్టీకి వ్యతిరేకంగా సంచలన కామెంట్లు చేశారు. జగన్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇంగ్లీష్ మీడియం ఉత్తర్వులు కోర్టుల్లో కొట్టుడుపోతాయని చెప్పారు. ఆ షాక్ నుంచి వైసీపీ తేరుకునేలోపే అదే ఏడాది డిసెంబర్ లో ఏకంగా 150మందికిపైగా ఎంపీలకు ఢిల్లీలో విందు ఏర్పాటుచేసి రఘురామ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సందు చేసుకుని మరీ అంశాల వారీగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ, సీఎం జగన్ తీరును ప్రశ్నిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే..
రాజధాని రచ్చబండ రచ్చరచ్చ
ఇంగ్లీష్ మీడియం విషయంలో పార్టీ లైన్ ను ధిక్కరించిన ఎంపీ రఘురామ తర్వాతి కాలంలో మూడు రాజధానులు, మండలి రద్దు, విశాఖలో భూకుంభకోణాలు, మన్సాస్ ట్రస్టు అధినేత్రిగా సంచైత ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ నిమ్మగడ్డతో ఏపీ సర్కారు విభేదాలు, జడ్జిలపై జగన్ ఫిర్యాదు.. ఇలా ప్రతి అంశంపై తనదైన వెర్షన్ వినిపిస్తూ, ‘రాజధాని రచ్చబండ' పేరిట రోజువారీ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఈ ఏడాదంతా రఘురామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హిడెన్ అజెండా ఏదైనప్పటికీ, ఆయన లేవనెత్తే అంశాల్లో ఎంతో కొంత లాజిక్, గోదావరి వెటకారం రంగరించిన విమర్శలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో అనతికాలంలోనే రఘురామ వార్తలకు విపరీతమైన వ్యూస్ పెరిగాయి. అందుకు..
చంద్రబాబును మించిన RRR
ఏపీ అప్ డేట్స్ కు సంబంధించిన వార్తలు, వ్యూస్లో సహజంగానే సీఎం జగన్ టాప్ లో ఉండగా, ప్రతిపక్షనేత, టీడీపీ చీఫ్ చంద్రబాబును సైతం తలదన్నేసి ఎంపీ రఘురామ హాట్ టాపిక్ గా కొనసాగారు. రాజధాని అమరావతి అంశంలో చంద్రబాబుకు దీటుగా రఘురామ కామెంట్లు జనంలోకి చొచ్చుకెళ్లాయి, ఉద్యమ కాలంలో అమరావతి రైతులచేత పాలాభిషేకం పొందిన తొలినేత కూడా రఘురాముడే. అంతేనా, ఏపీలో అవినీతి, జడ్జిలపై జగన్ ఫిర్యాదు లాంటి.. టీడీపీ చొరవతీసుకోలేని అంశాల్లోనూ ఆయన అదే పనిగా కామెంట్లు చేయడం, ఒక దశలో ప్రతిపక్షం అంటేనే తాననే స్థాయిలో మీడియా కవరేజీ లభించడంతో రాజుగారు ఇంకా రెచ్చిపోయారు. అయితే..
వైసీపీ పుట్టిముంచే ప్రయత్నం..
వైసీపీతో, సీఎం జగన్ తో విభేదాల విషయంలో తెగేదాకా లాగడమే తన స్టైలని రఘురామ చర్యలతో ప్రస్పుటంకాగా, వైసీపీ హైకమాండ్ చేతలకు దిగింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న రఘురామపై అనర్హత వేటేయాలంటూ వైసీపీ పెద్దలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆశ్రయించారు. కానీ.. ఆ సమయంలో రాజు.. వైసీపీ పుట్టిముంచే స్థాయిలో లాజిక్స్ లేవదీశారు. తాను ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' ఎంపీనని, పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదని వాదించారు. ఆ వాదనకు వైసీపీ సరైన కౌంటర్ వేయలేకపోయింది. ఆ తర్వాత ఏపీ సర్కారు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోదీకి మొరపెట్టుకున్న రఘురామ ఏకంగా కేంద్ర వై కేటగిరీ భద్రత కూడా పొందారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ, సాయిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే వైసీపీ సోషల్ మీడియా సైన్యాల ట్రోలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న రఘురామ.. ఎక్కడా తగ్గకపోవడం జగన్ వ్యతిరేకుల్లో ఆయన క్రేజ్ ను పెంచింది. ఆ మధ్య సీబీఐ దాడుల సమయంలో కొంత తడబడినా మళ్లీ తన విమర్శలు కొనసాగించారు..
రఘురామ హిడెన్ అజెండా ఇదేనా?
పశ్చిమగోదావరి జిల్లా ఐభీమవరంలో జన్మించిన రఘురామకృష్ణరాజు విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఏపీ నుంచి (2019లో) లోక్ సభకు ఎన్నికైన ఎంపీల్లో అత్యంత ధనవంతుడు ఆయనే. నర్సాపురం నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు చేస్తూ, రెబల్ స్టార్ కృష్ణంరాజు స్ఫూర్తితో బీజేపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2018ఏప్రిల్ నాటికి బీజేపీలో ఉన్న రఘురామ ఏడాది కాలంలో ఏకంగా మూడు పార్టీల్లోకి పల్టీలు కొట్టారు. 2019 ఎన్నికల నాటికి టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జిగా ఉన్న ఆయన.. నామినేషన్ల సమయంలో వైసీపీ తీర్థంపుచ్చుకుని అదే నర్సాపురం ఎంపీగా గెలిచారు. మళ్లీ కొద్ది నెలల్లోనే బీజేపీకి దగ్గరై, ఏపీలో కాషాయ అజెండాను బాహాటంగా అమలుచేస్తున్నారు. ఆలయాలపై దాడులు, జగన్ క్రిస్టియానిటీ, ఏపీలో చర్చి పాస్టర్లకు భృతి అంశాలను ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశం చేసిన ఆయనను.. వైసీపీని ఇంకొంత ఇరుకున పెట్టిన తర్వాతగానీ బీజేపీ నేరుగా పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు కనిపించడంలేదు. మొత్తంగా 2020 ఏడాదిలో ఎంపీ రఘురామ బిగ్గెస్ట్ న్యూస్ మేకర్ గా నిలిచారు.
Recommended Video
అమెరికాలో తెలుగు జంట భారీ మోసం -H-1B పేరిట రూ10కోట్లు టోకరా - బాధితులూ మనోళ్లే -ఏపీలో కలకలం