జగన్కు గుణపాఠం: శశిధర్, కోట్లు ఎలా సంపాదించారని..
విశాఖపట్నం: సాధ్యంకాని హామీలిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ప్రజలను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా చేస్తామని ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
2009లో వందల కోట్ల ఆస్తులున్న జగన్మోహన్ రెడ్డికి 2014కి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో తెలిపే విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ నేర్పించాలని ఆయన ఎద్దేవా చేశారు.
ట్రైనింగ్ స్కూళ్లు పెట్టేందుకు కావాలంటే ప్రభుత్వం నుంచి భూములు ఇప్పిస్తామని అన్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు, దౌర్జన్యం చేసేందుకు కడప నుంచి 300 మంది అసాంఘిక శక్తులు విశాఖపట్నం వచ్చాయనే ప్రచారం జరుగుతోందని శశిధర్ రెడ్డి చెప్పారు. అసాంఘిక శక్తుల నుంచి ఎన్నికల సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చాలంటే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
స్టాక్ ఎక్స్ఛేంజ్ రీతిలో జగన్ రాజకీయాలు: రావుల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు స్టాక్ ఎక్స్ఛేంజ్ రీతిలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ.. జగన్ కు తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రచార శైలి రైతుల్లో భయాందోళన కలిగిస్తోందని, కేసుల మాఫీ కోసమే జగన్ కేంద్రానికి మద్దతు ఇస్తానంటున్నారని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications