ఓటుకు నోటుకు కేసు ఎఫెక్ట్: మరో ఏడాది హైదరాబాద్లోనే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు మరో ఏడాది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. త్వరంలోనే ముఖ్యమైన లేదా ప్రధానమైన కార్యాలయాలను తాత్కాలిక రాజధానికి తరలిస్తామని చెబుతూ వచ్చారు. కానీ అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. విజయవాడలో మేథా టవర్స్తో పాటు మిగతా భవనాలు, గుంటూరులో ఎంపిక చేసిన భవనాలకు కొన్ని ప్రభుత్వ శాఖలను తరలిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది.
విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే ఎంపిక చేసిన ప్రభుత్వ శాఖలను తరలిస్తామని, ఉద్యోగులను బదిలీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రకటించారు. అయితే, అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కావడంతో, ఈ ఏడాదికి ఇక హైదరాబాద్ నుంచి ఏపి కొత్త రాజధాని ప్రాంతంలో విజయవాడ లేదా గుంటూరుకు కదిలే పరిస్ధితి లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఓటుకు నోటు కేసు ప్రభావంతో నెల రోజులు గడిచిపోయాయి. ఆ కేసు కారణంగా ప్రధాన కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. దీనికితోడు కొంతమంది మంత్రులు హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అని, తమకు కూడా సమాన హక్కులు ఉన్నాయని, అవసరమైతే పదేళ్ల తర్వాత కూడా ఇక్కడే కొనసాగుతామని ప్రకటనలు ఇచ్చారు. విజయవాడకు వెళ్లే ప్రతిపాదనలు ఈ స్థితిలో అటకెక్కాయి.

ఈ ఏడాది జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేశారు. వారానికి నాలుగు రోజులు విజయవాడలో ఉంటానని కూడా చెప్పారు. విజయవాడ లేదా గుంటూరు నుంచి తాత్కాలికంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తామని అనేక మంత్రులు చెబుతున్నారు. భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మినహా మరే మంత్రి కూడా విజయవాడ నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించలేదు.
నిరుడు విజయవాడకు కొన్ని ప్రభుత్వ శాఖలను బదలాయించే విషయమై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికకు అతీగతీ లేదు. ఈ ఏడాది జూన్ 1వ తేదీన ప్రభుత్వ శాఖలను తరలించే విషయమై ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇంతవరకు సమావేశం కాలేదని సమాచారం. విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభం కావడంతో హైదరాబాదు నుంచి తరలిపోవడానికి ఉద్యోగులు విముఖత ప్రదర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications