శిల్పా చక్రపాణిరెడ్డి ఎఫెక్ట్: ఎమ్మెల్సీ పదవికి తీవ్ర పోటీ, టీడీపీ అభ్యర్థి ఎవరు?
శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరి తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీకి నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
కర్నూలు: శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరి తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీకి నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ రేసులో టీడీపీ ఎవరిని బరిలో దింపనుందనే విషయం చర్చనీయాంశమైంది.
బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఎలాగైనా తన సోదరుడు రాజా రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో దింపేందుకు సీఎం చంద్రబాబు దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డి సీఎం చంద్రబాబును కలిసి తమ మనసులో మాట చెప్పుకున్నట్లు సమాచారం.
అందుకు సీఎం చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అదే క్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు శ్రీధర్రెడ్డి కృషి ఎంతో ఉంది. అందువల్ల తనకు అవకాశం ఇవ్వాలని శ్రీధర్రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు జిల్లాలో మరి కొందరు నాయకులు కూడా ఈ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అదే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి త్వరలోనే చేరబోతున్న మరో నాయకుడికి టీడీపీ అధిష్ఠానం ఆ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంటుం ది. ప్రస్తుతం సంఖ్యాబలం చూస్తే టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే. ఏప్రిల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ పెట్టింది. ఎలాగూ ఓటమి తప్పదని రాబోయే ఎన్నికలో వైసీపీ ఎమ్మెల్సీ బరిలో తన అభ్యర్థిని నిలపకపోవచ్చ కూడా!