ఊపిరున్నంత వరకూ జగన్తోనే: అఖిలప్రియ, బాబుపై శిల్పా తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నంద్యాలను జిల్లా చేయాలని శిల్పా మోహన్ రెడ్డి కోరారు. ఇక్కడ పరిశ్రమలు, విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నంద్యాలను జిల్లా చేయాలని శిల్పా మోహన్ రెడ్డి కోరారు. ఇక్కడ పరిశ్రమలు, విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు. అందుకే నంద్యాలను జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పారు. నంద్యాలలో గురువారం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాలలో సాక్షి టీవీని ప్రసారం కానివ్వడం లేదని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో టీవీ9 ప్రసారాలను కూడా ఆపేశారని టీడీపీ సర్కారుపై మండిపడ్డారు. భూమా అఖిలప్రియ అనాథలమని ప్రచారం చేసుకుంటున్నారని, ఆమె తండ్రి ఎంతమంది అనాథలను చేశారో తెలుసా? అని ప్రశ్నించారు. వారి బాధలు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.

నంద్యాల అభివృద్ది శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు చేయాలని అడిగితే డబ్బులు లేవని, సగం డబ్బులు మీరే పెట్టుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు తనకు చెప్పారని అన్నారు. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో రోడ్డు వెడల్పు చేస్తామంటున్నారని అన్నారు.
నంద్యాలకు 1200కోట్లు ఎక్కడిచ్చారని చంద్రబాబును శిల్పా మోహన్ రెడ్డి నిలదీశారు.
భూమా నాగిరెడ్డి గతంలో ఇచ్చిన హామీలను ఆయన ఉన్నంత వరకు కూడా నెరవేర్చలేదని అన్నారు. టీడీపీ నేత ఫరూఖ్.. ముస్లింలపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లింలకు ఎంత సేవ చేశానని తెలిపారు. ఎన్నో మసీదులకు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు.
ముస్లింలపై కేసులు పెట్టించానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముస్లింల మనసుకు తన వల్ల ఏదైనా బాధ కలిగితే తనను క్షమించాలని కోరారు. రాజకీయాల్లో టీడీపీ అడ్డుదారులు తొక్కుతోందని, కులాలు, మతాల పేరిట ప్రజలను విడదీస్తోందని ఆరోపించారు.
తాను, తన తమ్ముడు శిల్పా చక్రపాణి ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటామని శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. నంద్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications