కిరణ్ లేఖ: ప్రణబ్కు షిండే వివరణ, 8పార్టీలకు హోం లేఖ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖల నేపథ్యంలో షిండే రాష్ట్రపతికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ప్రణబ్కు చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లకు విభజనపై లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్రం విభజనపై ఏకపక్షంగా వెళ్తోందని, రాజ్యాంగబద్ధంగా వెళ్లేలా చూడాలని కిరణ్ వారికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ప్రణబ్.. ఆ లేఖపై వివరణ కోరుతూ హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. ఈ నేపథ్యంలో షిండే ఈ రోజు ప్రణబ్ ముఖర్జీని కలిసి విభజనపై వివరణ ఇచ్చారు.
పార్టీలకు లేఖ
నవంబర్ 5వ తేదీలోగా మంత్రుల బృందం(జివోఎం) విధివిధానాల పైన అభిప్రాయం చెప్పాలని ఎనిమిది రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి లేఖ రాశారు. నవంబర్ 5లోగా అభిప్రాయాలు చెబితే ఆ తర్వాత అఖిల పక్షం తేది ఖరారు చేస్తామని తెలిపారు. మరోవైపు కిరణ్ లేఖ పైన తాను రాష్ట్రపతికి ఎలాంటి వివరణ ఇవ్వలేదని షిండే భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు జివోఎం విధివిధానాలపై అభిప్రాయం చెప్పాలని లేఖ రాశామన్నారు. కిరణ్ లేఖ పైన స్పందించేందుకు నిరాకరించారు.
టి ఏర్పాటులో భాగంగానే అఖిలపక్షం: సారయ్య
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగమే అఖిలపక్ష సమావేశమని మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్లో తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ సీమాంద్రుల సమస్యల పరిష్కారానికే అఖిలపక్ష భేటీ ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా ఏర్పడుతుందని, తెలంగాణ ప్రజలకు ఆందోళన వద్దని మంత్రి సారయ్య అభయమిచ్చారు.












Click it and Unblock the Notifications