హీరో శివాజీకి కామెర్లు: బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న వైద్యులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ వచ్చిన తెలుగు సినీ హీరో శివాజీ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు బలవంతంగా ఆయనకు ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఆ రకంగా శివాజీ ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైంది. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తానని చెప్పిన శివాజీ తొలుత వైద్యం చేయించుకోవడానికి నిరాకరించారు.
అయితే, కామెర్ల వ్యాధి సోకడంతో పాటు కిడ్నీలపై కూడా ప్రభావం చూపిందని, దీంతో వైద్యులు బలవంతంగా ఆయనకు మందులు అందించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. డీహైడ్రేషన్ కూడా శివాజీని బాధిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజులుగా ఆయన మంచినీళ్లు కూడా సేవించలేదని అంటున్నారు.

వైద్యుల సలహాతో శివాజీని పోలీసులు బుధవారంనాడే దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. తనకు దీక్ష కొనసాగించాలని ఉందని, అయితే ఆరోగ్య రీత్యా వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండడంతో తాను ఏమీ చేయలేకపోతున్నానని శివాజీ అన్నట్లు సమాచారం
గుంటూరులో గత నాలుగు రోజులుగా శివాజీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న స్థితిలో నిరాహార దీక్షను కొనసాగించడం సరి కాదని శివాజీ భావించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం దిగి రాకపోవడంపై శివాజీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు యలమంచిలి రవిచంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications