రాజధానిపై చంద్రబాబుకు శోభనాద్రీశ్వర రావు తలనొప్పి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన రాజధాని వ్యవహారంలో తెర మీదికి వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన శోభనాద్రీశ్వర రావు నుంచి వ్యతిరేకత ఎదురు కావడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందికరమైన విషయమే. ఆయన వ్యవసాయ నిపుణుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.
ప్రభుత్వ భూములు లేదా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే పదివేల ఎకరాలలోపు భూమిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గాంధీనగర్ రాజధానికి 12వేల ఎకరాలు, నయారాయపూర్కు 20 వేల ఎకరాలను సేకరించారన్నారు. గాంధీనగర్లో రాజధాని భవనాలను 500 ఎకరాలు, నయారాయపూర్లో 750 ఎకరాల్లో నిర్మించారన్నారు. మన రాష్ట్రం తొలి దశలో 30 వేల ఎకరాలను, మలిదశలో ఒక లక్ష ఎకరాల పంట భూములను సమీకరించేందుకు ప్రయత్నించడం భావ్యం కాదని, దీనిని ప్రజలు క్షమించరని అన్నారు.
ప్రభుత్వం సమీకరించ తలపెట్టిన లక్ష ఎకరాల్లో ఏ నిర్మాణాలు చేస్తారో ప్రజలకు తెలియచేయాలన్నారు. తుళ్లూరుకు 15 కిలో మీటర్ల దూరంలోని గుంటూరులో 12 వేల ఎకరాలు, విజయవాడలో 16 వేల ఎకరాల్లో సకల సదుపాయాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో లక్ష ఎకరాలు ఎందుకో ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు, కార్యాలయాలను 13 జిల్లాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధితో పాటు అధికారాన్ని వికేంద్రీకరించాలని, తద్వారా మరోసారి ప్రాంతీయ ఉద్యమాలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్కు 436 కోట్లు, జార్ఖండ్కు 800 కోట్లు, చత్తీస్గఢ్కు 580 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చిందని, మన రాష్ట్ర రాజధానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా సేకరిస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఇలాంటి దుస్సాహసానికి పాల్పడటం సరికాదని, బహుళ పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూములను రాజధాని నిర్మాణం కోసం సేకరించరాదన్నారు.
70 శాతం పైగా రైతులు అనుకూలంగా ఉంటేనే భూసేకరణ చేయాలని 2013 భూసేకరణ చట్టం స్పష్టం చేస్తోందన్నారు. కేరళలో కొచ్చి స్మార్ట్ సిటీని 246 ఎకరాల్లో, దక్షిణ కొరియాలో ఈయున్ స్మార్ట్ సిటీని 862 ఎకరాల్లో నిర్మిస్తుండగా ఏపి రాజధానిని లక్ష ఎకరాల్లో నిర్మించడం భావ్యం కాదన్నారు. ఇలా చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పారిశ్రామిక దిగ్గజాలకు మేలు చేయడమే అవుతుందని శోభనాద్రీశ్వరరావు అన్నారు.