అసెంబ్లీ సెక్రటరీకి విద్యార్హత లేదు: బాబుకు జగన్ పార్టీ మరో షాక్, హైకోర్టుకు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంచార్జ్ సెక్రటరీ సత్యనారాయణ పైన హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలైంది. ఆ పదవికి ఆయన అనర్హుడంటూ మంగళగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
సత్యనారాయణకు లా డిగ్రీ లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్ఙత లేకున్నా రెండున్నరేళ్లుగా అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. కాగా, గతంలోను పలు అంశాలపై వైసిపి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఏవోబీ పైన..
ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీసీఎల్సీ పిటిషన్ వేసింది. ఏవోబీలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 23మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏపీసీఎల్సీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎన్కౌంటర్ ఓ బూటకమని, పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి మావోలను హతమర్చారని, ఇది పూర్తిగా హత్యానేరం కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ సమయంలో ఉన్న పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు.