టీడీపీకి షాక్: పార్టీకి ఎంవీఆర్ చౌదరి గుడ్ బై! 29న వైసీపీలోకి?
విజయవాడ టీడీపీలో కీలక నేత అయిన ఎంవీఆర్ చౌదరి(మండవ వెంకట్రామ్ చౌదరి) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈనెల 29న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.
అమరావతి: విజయవాడ టీడీపీలో కీలక నేత అయిన ఎంవీఆర్ చౌదరి(మండవ వెంకట్రామ్ చౌదరి) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈనెల 29న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.
ఆయనతోపాటు విజయవాడకు చెందిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీలో చేరనున్నారు. ఏళ్ల తరబడి సేవలందించినా.. సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతోనే ఎంవీఆర్ చౌదరి పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంవీఆర్ చౌదరికి మంచి పట్టు ఉంది. ఆయన పార్టీ మారితే టీడీపీకి తలనొప్పులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.
ఆయన భార్య అనురాధ కూడా కృష్ణా జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు. భార్యాభర్తలిద్దరికీ పదవులు కట్టబెట్టి, తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతోనే.. ఎంవీఆర్ చౌదరి టీడీపీని వీడుతున్నారని చెబుతున్నారు.