టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు షాక్ : అమర్ రాజా బ్యాటరీ యూనిట్ల పవర్ కట్, మూసివేత నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు షాక్ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని కారణంగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీ యూనిట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పవర్ కట్ చెయ్యాలని ఆదేశించటంతో ఎలక్ట్రసిటీ బోర్డ్ పవర్ కట్ చేసింది.
పార్లమెంట్ దృష్టికి భౌతిక దాడి.. ఛలో అసెంబ్లీ ఘటనపై లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నోటీసు
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ రెండు యూనిట్లను మూసెయ్యాలని నోటీసులు
అమర్ రాజా బ్యాటరీల కంపెనీ బ్యాటరీల నుండి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతోందని పేర్కొన్న కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసింది.టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, తిరుపతి కరకంబాడి యూనిట్లను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.దీంతో నిన్నటి నుండి సంస్థలు ఉత్పత్తి నిలిచిపోగా, తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని సంస్థ యాజమాన్యం ప్రకటన చేసింది.
అమర్ రాజా బ్యాటరీస్ కు పవర్ కట్ చేసిన అధికారులు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డుకు పంపిన ఆదేశాల మేరకు అమర రాజా బ్యాటరీస్ కి సంబంధించిన తయారీ యూనిట్ల కరెంటు సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం అమర రాజా బ్యాటరీస్ కంపెనీలో ప్రత్యక్షంగా 50 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. సంస్థను మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏడాదికి పదివేల కోట్ల టర్నోవర్ తో కంపెనీ వ్యాపారం నిర్వహిస్తోంది.
చట్టపరంగా ముందుకు వెళ్తాం అన్న అమర్ రాజా కంపెనీ
గత 35 సంవత్సరాలుగా పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సంస్థను నడిపిస్తున్నామని, పలు దేశాలకు రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను అందిస్తున్నామని ,ఈ నోటీసులపై చట్టపరంగా ముందుకు వెళ్తామని అమర్ రాజా బ్యాటరీ సంస్థ వెల్లడించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి సంస్థను నడపాలని ప్రయత్నం చేస్తే ప్రాసిక్యూట్ చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించింది.అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వల్ల నీటి కాలుష్యంతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని పేర్కొంది.
ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు
ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు, కార్మికుల శరీరాలలో కూడా లెడ్ శాతం బాగా పెరిగిపోయిందని, ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది.1974 వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ అమెండ్మెంట్ యాక్ట్ 1981,ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది.ఇప్పటికే ఇటీవల టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే సంగండెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసి,అరెస్ట్ చేసిన క్రమంలో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
టీడీపీ నేతల సంస్థలు , వ్యాపారాలపై వరుస దాడులు,ఆందోళనలో టీడీపీ నేతలు
తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు షాక్ ఇస్తూ అమర్ రాజా బ్యాటరీ కంపెనీ యూనిట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా వరుసగా టిడిపి నేతలు చేస్తున్న వ్యాపారాలపై జరుగుతున్న దాడులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగటం హేయం అని మండిపడుతున్నారు.