సొంత జిల్లాలో జగన్కు మరో ఝలక్: బిజెపిలోకి కందుల బ్రదర్స్
కడప: సొంత జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటిస్తే ఇప్పుడు కుందల బ్రదర్స్ పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. బిజెపిలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశ్వాసంతో మెలిగిన కందుల బ్రదర్స్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్రెడ్డి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్ లేదనే బీజేపీలోకి వెళ్తున్నట్లు శుక్రవారం మీడియా ముందు ప్రకటించారు. కడపలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేస్తామని రామోహన్రెడ్డి తెలిపారు. ఇదివరకే కొంత మంది జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు పార్టీ శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డితో విభేదాలు రచ్చకెక్కాయి. చాలా కాలంగా ఆదినారాయణ రెడ్డి జగన్కు దూరంగా ఉంటున్నారు. అయితే, తాను జగన్కు దూరంగా ఉన్న విషయాన్ని ఆయన తాజాగా శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆదినారాయణ రెడ్డి ఆ విషయం చెప్పారు. జగన్ తీరు నచ్చకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నానని, మధ్యవర్తులు రాజీప్రయత్నం చేసినా వెళ్లలేదని ఆయన తెలిపారు.
జగన్ రాజకీయాల్లో పరణతి చెందిల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని ఆయన తెలిపారు. నియోజవర్గ ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. వైయస్ జగన్ తీరుపై విశాఖపట్నం జిల్లా అరకు లోకసభ సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.