వివాదంలో జగన్ రైట్ హ్యాండ్...జాతీయమీడియాలో రచ్చ..సీఎం సమర్థతకు సవాల్గా..!
విజయవాడ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి భారత్లో ఇప్పటికే 700కు పైగా మరణించారు. 23వేలకు పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి అంతా కలిసి పనిచేయాలంటూ ఇటు ప్రధాని మోడీ అటు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు పిలుపునిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. అయితే మచిలీపట్నం ఎంపీ వ్యవహరించిన తీరుమాత్రం విమర్శలకు దారి తీస్తోంది.

కరోనావైరస్ టెస్టింగ్ ల్యాబ్ను ఖాళీ చేయమన్న ఎంపీ బాలశౌరీ
ఇక అసలు విషయానికొస్తే కరోనావైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనావైరస్ పరీక్షలు చేపట్టే ల్యాబ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ల్యాబ్లకు కూడా టెస్టింగ్ అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ల్యాబ్లను గుర్తించి అన్ని సదుపాయాలు ఉంటే అనుమతి ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కరోనా పరీక్షల కోసం హైదరాబాదులోని ఓ ల్యాబ్కు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ల్యాబ్ ఉన్న భవనం వైసీపీ ఎంపీ బాలశౌరిది కావడం విశేషం. అయితే ల్యాబ్ పనులకు ఎంపీ బాలశౌరీ ఆటంకం కలిగిస్తున్నారని వెంటనే తన భవనంను ఖాళీ చేయాలని ల్యాబ్ ఓనర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న వార్త వెలుగుచూసింది. దీన్ని తప్పుబట్టారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.
తప్పుబట్టిన చంద్రబాబు
కరోనా పరీక్షల కోసం ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ల్యాబ్ పనులకు ఎంపీ ఆటంకం కలిగించడం దారుణమన్నారు చంద్రబాబు. కరోనా వైరస్ పోరులో ప్రాణాలకు తెగించి వైద్యసిబ్బంది పనిచేస్తోంటే వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు చేసిన ట్వీట్కు ఇదే అంశంపై చర్చ పెట్టిన ఓ జాతీయ ఛానెల్కు సంబంధించిన వీడియోను కూడా జతచేశారు చంద్రబాబు.

అసలేం జరిగింది..? జగన్ చర్యలు తీసుకుంటారా..?
ఇక హైదరాబాదులోని కినేటా టవర్లో నిర్వహిస్తున్న టెనెట్ మెడ్ కార్పొ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ యాజమాన్యానికి వైసీపీ ఎంపీ బాలశౌరి మధ్య వివాదం నెలకొంది. కరోనావైరస్ వేళ పరీక్షలు నిర్వహించొచ్చని ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన తర్వాత భవంతిని ఖాళీ చేయాలంటూ బాలశౌరి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అంతేకాదు ఆ సంస్థకు వెళ్లే దారిని కూడా బాలశౌరి మూసివేశారని తెలుస్తోంది. దీనిపై ల్యాబ్ యాజమాన్యం తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేయగా పోలీస్ శాఖ స్పందిచిన తీరుకు ల్యాబ్ యజమాని కృతజ్ఞతలు తెలిపారు. ఒక పార్లమెంటు సభ్యులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని యజమాని చెప్పారు. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా యాజమాన్యానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే బాలశౌరి వ్యవహరించిన తీరు సీఎం జగన్కు కొత్త తలనొప్పిగా మారింది. సీఎం జగన్ బాలశౌరిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications