తెలుగు తమ్ముళ్ళకు పోలీస్ మార్క్ షాక్: లోకేష్ తో పాటు టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ వైసీపీ నేతల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, పట్టాభి ఇంటిపైన వైసీపీ కార్యకర్తలు దాడులు ఏపీలో ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. ఇదిలా ఉంటే విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై దాడికి పాల్పడ్డారన్న అభియోగంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
లోకేష్ పై హత్యా యత్నం కేసు నమోదు..
స్థానిక సీఐ నాయక్ పై లోకేష్ దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.ఈ కేసులో మొదటి నిందితుడిగా నారా లోకేష్ పేరును పేర్కొన్నారు పోలీసులు.లోకేష్ తో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతల పైన కేసులు నమోదు చేశారు. టిడిపి నేత అశోక్ బాబును రెండవ నిందితుడుగా,ఆలపాటి రాజాను మూడవ నిందితునిగా, శ్రవణ్ ను నాలుగవ నిందితుడిగా,5వ నిందితుడిగా పోతినేని శ్రీనివాసరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు టీడీపీ నేతలపై కేసు నమోదుకు కారణం ఇదే
అసలేం జరిగిందంటే మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి ఘటన జరిగిన తర్వాత టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి నారా లోకేష్ అక్కడి దాడి పరిస్థితిని పర్యవేక్షించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఉద్యోగులను పరామర్శించారు. పార్టీ ఆఫీస్ లో దాడి దృశ్యాలను పరిశీలించారు. ఇదే సమయంలో స్థానిక సిఐ నాయక్ అక్కడకు వెళ్ళగా నారా లోకేష్ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారని, లోకేష్ తో పాటు అక్కడున్న వారు ఆగ్రహంతో సిఐ పై దాడికి ప్రయత్నం చేశారని, వారి నుండి తప్పించుకున్న సీఐ నాయక్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. సీఐ పై దాడికి ప్రేరేపించింది లోకేష్ కాబట్టి లోకేష్ ను ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చినట్లు గా పోలీసులు చెప్తున్నారు.
టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు
ఇక టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు, వివిధ చోట్ల టీడీపీ ఆఫీసులపై దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దాడుల ఘటనలపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లోకేష్ తో పాటు టీడీపీ నేతలపై కేసులపై టీడీపీ ధ్వజం
తెలుగుదేశం పార్టీ నేతల ఆఫీసులపై వైసిపి కార్యకర్తలు దాడులు చేస్తే వారిపై నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా, టిడిపి కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై, టిడిపి నేతలపై కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి చివరకు ఈ విధంగా తయారయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసులు టీడీపీ నేతల పైన కేసులు నమోదు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications