విజయవాడలో వ్యాపారి ఆత్మహత్య...ఐటీ అధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబీకులు
విజయవాడ:కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రముఖ వ్యాపారి, మార్కెట్ మాజీ డైరెక్టర్ మహ్మద్ సాదిక్(46) ఆత్మహత్య పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఐటి అధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
పెనమలూరు మండలంలోని కానూరుకు చెందిన మహ్మద్ సాదిక్ ఆటోనగర్లో లారీ బాడీ బిల్డింగ్ షెడ్డు ఉంది. అయితే ఆదివారం తెల్లవారుజామున ప్రార్థనా మందిరానికి వెళుతన్నానని ఇంట్లో చెప్పివెళ్లిన ఆయన ఆ తరువాత ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో మహ్మద్ సాదిక్ మృతదేహాన్నిపోలీసులు తోట్లవల్లూరు కరువు కాల్వలో గుర్తించారు. ఆయన మృతికి ఆదాయ పన్ను శాఖ అధికారుల వేధింపులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాదిక్ షెడ్డు లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలించి జిఎస్టీ కింద 50 లక్షల జరిమానా విధించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అలాగే తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్ను కోరారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, దీనికి వ్యక్తిగత సమస్యలు తోడవడంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు వివరిస్తున్నారు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications