ఏపీలో జనాలకు కరెంట్ బిల్లుల షాక్: వేలల్లో బిల్లులు..టెన్షన్ లో ప్రజలు
ఒకపక్క కరోనా లాక్ డౌన్ తో పెరిగిపోయిన ఆర్ధిక ఇబ్బందులు భయపెడుతుంటే మరోపక్క ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు దడ పుట్టిస్తున్నాయి. విపరీతంగా వచ్చిన కరెంట్ బిల్లులతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఏపీ ప్రజలు . ఈసారి కరోనా లాక్ డౌన్ ప్రభావంతో కాలుష్యం లేక ఈ హాట్ సమ్మర్ కాసింత కూల్ గా ఉందనే చెప్పాలి . అయినా సరే ప్రజలు కరెంట్ వినియోగం తక్కువగా ఉన్నా వేలల్లో వస్తున్న బిల్లులు వారిని నిద్ర పోనివ్వటం లేదు.
Recommended Video
ఏపీలో విద్యుత్ బిల్లుల బాదుడు .. లబోదిబో అంటున్న ప్రజలు
ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల్లో తేడాలు వచ్చాయి. అసలే కరోనా కష్ట కాలంలో ఉంటే ఇక ఇప్పుడు ఇష్టారాజ్యంగా వస్తున్న కరెంట్ బిల్లులు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయి . లెక్కకు మించి బిల్లు వస్తుండటంతో విద్యుత్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . మరీ దారుణంగా పూరి గుడిసెల్లో ఉన్న వారికి సైతం నలభై వేలకు పై చిలుకు కరెంట్ బిల్లులు వస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు . దీంతో అలా వేలకు వేలు బిల్లులు వచ్చిన వారు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు .
బీడీలు చుట్టుకునే సాధారణ మహిళ ఇంటికి నలభై వేల పైచిలుకు బిల్లు
తాజాగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో సాధారణ జీవనం సాగించే ఒక మహిళకు నలభై వేల పైచిలుకు కరెంట్ బిల్లు వచ్చింది. అలాగే శ్రీకాళహస్తిలో కూడా 28 వేల కరెంట్ బిల్లులు వచ్చాయంటే విద్యుత్ అధికారుల కరెంట్ బాదుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో ఛాన్వి అనే మహిళ ఇంట్లో ఒక టీవీ, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. బీడీలు చుడుతూ జీవనం సాగించే ఆమెకు ఏకంగా రూ.41వేల 149 కరెంట్ బిల్లు ఇచ్చి షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖాధికారులు . ఇక ఆ బిల్లు చూసిన సదరు మహిళ లబోదిబోమంటుంది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తాను ఇంత బిల్ ఎలా కట్టాలని , అసలు అంత కరెంట్ తాను వాడలేదని ఆమె అంటోంది .
కాళహస్తిలోనూ భారీగా వచ్చిన కరెంట్ బిల్లులు
ఇక అంతేకాదు శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో ఓ పేద కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో వారు ఇంత బిల్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు . తమకు ఎప్పుడూ వేసవిలోనూ వందల్లోనే బిల్లులు వచ్చేవని, ఇప్పుడు ఏకంగా 20 వేలు , 30 వేలు బిల్లులు వస్తే ఎలా కడతామని అంటున్నారు .తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు కరెంట్ బిల్ టెన్షన్ .. బిల్లుల మోతపై ఆగ్రహం
ఒక్క చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ పరిస్థితి అలాగే ఉంది. విపరీతమైన కరెంట్ బిల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో కరెంటు బిల్లు రాలేదు. ఇప్పుడు రెండు నెలల(ఏప్రిల్, మే) కరెంటు బిల్లు ఒకేసారి ఇచ్చారు. ఈ క్రమంలో విద్యుత్ బిల్లులు భారీ మొత్తంలో వస్తున్నాయి.అయితే అసలు వినియోగానికి మించి లెక్క లేకుండా ఇష్టారాజ్యంగా సామాన్యులకు సైతం నలభై, యాభై వేల కరెంట్ బిల్లులు రావటం ఇప్పుడు ఏపీలో ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుంది . పెద్ద చర్చకు కారణం అవుతుంది.