AP Minister Usha Sri Charan: మంత్రిపైకి ఎక్కి ఆశీర్వదించిన వానరం- అనంతలో ఘటన
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్ ఓ పూజ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాసాపురం ఆంజనేయస్వామి ఆలయం ఇందుకు వేదికైంది. దీంతో మంత్రి గత వారం రోజుల్లో రెండోసారి వార్తల్లోకి ఎక్కారు.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ వద్దకు వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పూజలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం తేరుకుని మంత్రికి లభించిన అరుదైన ఆశీర్వాదం గురించి చర్చించుకుంటున్నారు.
మంత్రిపైకి ఎక్కి ఆశీర్వదించిన వానరం- అనంతలో ఘటన pic.twitter.com/OHLgpWXIPD
— oneindiatelugu (@oneindiatelugu) April 18, 2022
అనంతపురం జిల్లాలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి వారిని మంత్రిగా తొలి సారి ఉషశ్రీ చరణ్ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి వారు మంత్రిని సన్మానిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వానరం వచ్చి ఆమె ఒళ్ళో కూర్చుంది. అనుకోని ఘటనతో మంత్రి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే అది ఏమీ చేయదంటూ పక్కనే ఉన్న వారు మంత్రికి తెలిపారు. దీంతో ఆమె కూడా భయపడకుండా అలాగే కూర్చున్నారు. పూజారులు మంత్రికి ఇచ్చే ప్రసాదాలని నిశితంగా పరిశీలించి అది తిరిగి వెళ్లిపోయింది. సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి వానర రూపంలో వచ్చి మంత్రి గారికి తీర్ధప్రసాదాలు అందించి వెళ్లారంటూ అక్కడి వారంతా చర్చించుకోవడం కనిపించింది.
వాస్తవానికి జిల్లాకు చెందిన ఉషాశ్రీ చరణ్ తొలిసారి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బందోబస్తు కల్పించే క్రమంలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టడంతో అటుగా వెళ్తున్న ఓ అనారోగ్య చిన్నారి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆలస్యమై ప్రాణాలు విడించిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పోలీసులు తమ బ్యారికేడ్లు ఈ ఘటనకు కారణం కాదని ప్రకటించారు. ఈ ఘటన తర్వాత వానరం ఘటనతో మంత్రి పేరు జిల్లాలో మార్మోగుతోంది.