సినీ ఫక్కీలో.. వేట కొడవళ్ళతో నరికి .. కర్నూలులో ఇద్దరు కీలక టీడీపీ నేతల దారుణ హత్య
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన అన్నదమ్ములైన మాజీ సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని కొందరు ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా వేట కొడవళ్ళతో నరికి హతమార్చారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది.
అందరి ఖాతాలు సెటిల్ చేస్తాం .. రెండింతలు తీసుకొనేందుకు రెడీ అవ్వండి .. నారా లోకేష్ వార్నింగ్
స్మశానానికి వెళ్లి వస్తుండగా ఘటన .. గాయపడిన మరోముగ్గురు
ఈ దారుణ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయినట్లుగా తెలుస్తుంది . గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు మూడవరోజు క్రతువు నిర్వహించడం కోసం స్మశానానికి వెళ్లి వస్తున్న క్రమంలో కాపు కాచి మరీ ప్రత్యర్థులు హతమార్చినట్లుగా తెలుస్తుంది. మొదట బొలెరో వాహనాలతో ఢీకొట్టి, ఆ తర్వాత వేట కొడవలితో నరికి చంపేశారు. ఈ ఘటనలో మృతుల బంధువులు స్మశానం నుండి తిరిగి వస్తుండగా వైసిపి నాయకులు వీరిని వాహనంతో ఢీకొట్టించి అత్యంత దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్షన్ కక్షలు మళ్ళీ తెరపైకి ... ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
మృతి చెందిన అన్నదమ్ములు వర్గానికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వర్గానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కక్షలు ఉన్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పోలీసులు ఈ హత్యలకు గల కారణాలను నిర్ధారించలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులు ఎవరనే దానిపై విచారణ జరుపుతున్నారు. అక్కడ ప్రాధమిక ఆధారాలను క్లూస్ టీమ్ సేకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైన అన్నదమ్ముల హత్య నేపథ్యంలో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గ్రామంలో భారీ బందోబస్తు .. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
దీంతో పోలీసులు గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. నంద్యాల డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి వాంగ్మూలాలను బట్టి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది. సినీ ఫక్కీలో పక్కా ప్లాన్ గా చేసిన ఈ హత్యల వెనుక ఉంది ఎవరనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమంటున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి.