ఇంటి దొంగలే షాపునకు దంపతులు కన్నమేశారు
కరీంనగర్: కిరాణా దుకాణం యజమాని చాతుర్యంతో దొంగలు పట్టుబడ్డారు. ఇల్లు అద్దెకిచ్చిన యజమాని దుకాణానికే దంపతులు కన్నం వేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సిసిటివీ కెమెరాలతో వారి దొంగతనం బయటపడింది. సిసిటివీ ఫుటేజీ సాయంతో దుకాణం యజమానికి ఆ భార్యాభర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలు ఇలా ఉన్నాయి - నగనూరి వెంకటేశం, అంజలి దంపతులు గోదావరిఖనిలో కళ్యాణ్ నగర్ ఎఫ్సిఐ క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. కింది పోర్షన్లో వెంకటేశం కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. ఆ ఇంటి భవనంపై ఓ వ్యక్తి తన భార్యతో కలిసి తొమ్మిదేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు.
రెండేళ్ల క్రితం దుకాణం తాళం చెవి పోవడంతో వెంకటేశం మారు తాళం చెవి చేయించాడు. అయితే, దుకాణంలోని విలువైన వస్తువులు, సరుకులు మాయం అవుతుండడంతో అతను అయోమయానికి గురవుతున్నాడు. ఇంట్లోని 12 తులాల బంగారం నగలు ఒక్కటొక్కటిగా మాయమయ్యాయి. దీంతో వెంకటేశానికి భార్యపై అనుమానం వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి.
అయితే, స్నేహితుడి సలహాతో వెంకటేశం 20 రోజుల క్రితం సిసి కెమెరా ఏర్పాటు చేయించాడు. ఈ నెల 25వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెంకటేశం భార్యతో కలిసి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చిన వెంకటేశానికి ఐదు వేల రూపాయల నగదు, సరుకులు మాయమైనట్లు అర్థమైంది. దాంతో సిసిటీవి దృశ్యాలను పరిశీలించాడు. సిసిటీవి ఫుటేజీని తీసుకుని వెళ్లి వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.