ప్రాణం తీసిన 'పకోడి గొడవ' : యువకుడి మృతి
కర్నూల్ : చికెన్ పకోడి విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. ఏకంగా ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. చికెన్ పకోడి కొనడానికి వెళ్లిన యువకుడికి.. దుకాణదారుడికి మధ్య కొసరు విషయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త దాడులకు దారితీయడంతో యువకుడి ప్రాణాలే బలైపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో ఉన్న రాయల్ చికెన్ సెంటర్లో చికెన్ పకోడి అమ్ముతుంటారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రమోహన్(30) శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చికెన్ పకోడి కొనుగోలు కోసం వెళ్లాడు. చికెన్ పకోడి ఆర్డర్ ఇచ్చాక.. కొసరు విషయంలో చికెన్ సెంటర్ నిర్వాహకుడికి చంద్రమోహన్ కు మధ్య వాగ్వాదం జరిగింది.
మాటా మాటా పెరగడంతో.. చికెన్ సెంటర్ ఓనర్ అబూబకర్ అదే సెంటర్ లో పనిచేసే డైమాండ్ వలి, రియాజ్, వంట మాస్టర్ లతో కలిసి చంద్రమోహన్ పై దాడి చేశాడు. దీంతో ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు చంద్రమోహన్. అనంతరం చంద్రమోహన్ బంధువులంతా చికెన్ సెంటర్ వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీయడంతో.. మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది.
ఇరు వర్గాలు పరస్పరం చేసుకున్న దాడుల్లో చంద్రమోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన ఆసుపత్రి కోసం అక్కడినుంచి కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చంద్రమోహన్ మరణించినట్టుగా ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. దాడి చేసిన చికెన్ సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.