సర్దుకుపోవడం కష్టం: బాబుకి వైసిపి అసంతృప్తి సెగ, నేడే టిడిపిలోకి..
విజయవాడ: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ చేరిక పైన శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూమా చేరిక పైన తమ అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు గతంలోనే చెప్పామని వారు అంటున్నారు.
నంద్యాల, ఆళ్లగడ్డలలో భూమా, అఖిల ప్రియ చేరితే కార్యకర్తలు సర్దుకుపోవడం కష్టమేనని చెప్పారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటానని చెప్పారని, ఏ నిర్ణయం తీసుకున్నా తాము అభ్యంతరం వ్యక్తం చేయమన్నారు.
కర్నూలు అంటేనే రాజకీయ వర్గాలతో కూడుకున్నదన్నారు. కర్నూలులో భూమా కుటుంబం చేరితే కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఉంటాయన్నది మాత్రం వాస్తవమని శిల్పా సోదరులు అభిప్రాయపడ్డారు. అయితే, అన్నీ చూశాకే తాను నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పారని వారు చెబుతున్నారు.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉందని, చేరికలు అవసరం లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. డీలిమిటేషన్ నేపథ్యంలో కొందరి చేరిక మాత్రం అవసరమని చెబుతున్నారు. ఇప్పటికే కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరిక పైన రామసుబ్బా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజే చేరికలు!
ఏపీలో జంపింగ్ రాజకీయం ఊపందుకుంది. వైసిపి నుంచి కొందరు ఎమ్మెల్యేలు టిడిపిలో ఏ క్షణమైనా వెళ్లవచ్చన్న ఊహాగానాలు వస్తున్న వి,యం తెలిసిందే. ఈ వార్తలు వారం రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ రోజు సాయంత్రం కనీసం నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలతో పాటు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు చంద్రబాబుతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి ముందే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు చర్చిస్తారు. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యాకే భూమా మనసులో మాట వెల్లడించే అవకాశముంది.
అంతకుముందు, భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ... తాను పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేయలేదని, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతారా అని ప్రశ్నించగా... రోజులు లేదా గంటలు పట్టవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే, సాయంత్రం ఆయన మనసులో మాట వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications