శిల్పా తాజా ప్రకటన: భూమా నాగిరెడ్డితో వైరానికి ముగింపు పలికినట్లేనా?
విజయవాడ: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టిడిపి సీనియర్ నేతలైన శిల్పా సోదరుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు ముగింపు పలికేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ సర్పంచ్ తులసిరెడ్డిపై భూమానే దాడిచేశారని ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేసిన చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత భూమా నాగిరెడ్డి కూడా ఇదే విషయంపై చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఆ దాడితో తనకు సంబంధం లేదని, తనను అనవసరంగా నిందిస్తున్నారని పార్టీ అధినేతకు భూమా నాగిరెడ్డి మొరపెట్టుకున్నారు. కాగా, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

గత కొంతకాలంగా ఎమ్మెల్యే భూమా, శిల్పా బ్రదర్స్ మధ్య అంతర్గతంగా రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నంద్యాల నడిబొడ్డున కొత్తపల్లె గ్రామ సర్పంచ్, టీడీపీ లీగల్ సెల్ అడ్వయిజర్ తులసిరెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
తన ముఖ్య అనుచరుడైన తులసిరెడ్డిని హతమార్చేందుకు ఎమ్మెల్యే భూమావర్గం కుట్రచేసిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీమంత్రి శిల్పా మోహన్రెడ్డి మీడియా ఎదుట ఆరోపణలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా నంద్యాల రాజకీయాలతోపాటు రాష్ట్ర రాజకీయం కూడా వేడెక్కింది.
ఈ ఘటనకు భూమా నాగిరెడ్డి కారణమంటూ శిల్పా మోహన్ రెడ్డి పార్టీ అధినేతకి ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే భూమాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే శిల్పా బ్రదర్స్ ఆయనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని భూమావర్గం వాదిస్తోంది. అయితే, శిల్పా సోదరులను రాజకీయంగా అణగదొక్కేందుకు భూమావర్గం పన్నుతున్న కుట్రలు తులసిరెడ్డి ఘటన ద్వారా స్పష్టమైందని శిల్పావర్గం చెబుతోంది.
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కొద్దిరోజులకే ఎమ్మెల్యే భూమాపై శిల్పా సోదరులు ఆరోపణలు ఎక్కుపెట్టడంతో రాజకీయ దుమారం రేపింది. ఇలాంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీలో భూమా, శిల్పా బ్రదర్స్ కలిసి పని చేస్తారా? లేదా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.
అయితే, ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఓ ప్రకటన చేశారు. నంద్యాల విషయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీమంత్రి ఎన్ఎమ్డీ ఫరూఖ్తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో అప్పటివరకూ వేడిమీదున్న నంద్యాల రాజకీయ సెగలు చల్లారినట్లయింది.
అంతేగాక, తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలను చల్లార్చేందుకు, నంద్యాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి.. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని శిల్పా చక్రపాణిరెడ్డి వివరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని కూడా చెప్పారు.
శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటనతో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రాజకీయ వైరం లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరులు కలిసి పని చేస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని వారు భావిస్తున్నారు. మరి కార్యకర్తలు అనుకున్నట్లే జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.












Click it and Unblock the Notifications