ఏపీ రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన, జులై 15లోగా నివేదిక
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో సింగపూర్ బృందం మంగళవారం పర్యటించింది. సింగపూర్కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెం, వెంకటపాలెం, మందడం, ప్రకాశం బ్యారేజీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
దీనిపై సింగపూర్ బృందం సమగ్ర పరిశీలన చేశారు. రాజధాని ముఖ్య ప్రాంతంపై ఒక ప్రణాళికను తయారు చేసి జులై 15లోగా ఈ బృందం నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏపీ రాజధానిపై సోమవారం సింగపూర్ ప్రభుత్వం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి అప్పగించింది.
కృష్ణా నదీ పరీవాహానికి ఇరువైపులా రాజధాని నగరం విస్తరించేలా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి సుమారు 55 వేల ఎకరాల్లో ఉండనుంది. దీని విస్తీర్ణాన్ని 217 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేశారు.
ఈ మాస్టర్ ప్లాన్లో మొత్తం తొమ్మిది భాగాలు ఉన్నాయి. మొత్తం రాజధాని ఏరియా ప్రాంతం 7,420 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లు. ఇందులోనే 217 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని నగరం ఉంటుంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ భవనాలుండే సీడ్ కేపిటల్ ఇందులో మధ్యలో వస్తుంది. మాస్టర్ ప్లాన్లో ఐదు కీలక ఘట్టాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, నివాసయోగ్య నగరం, కనెక్టివిటీ, యాక్టివ్ మొబిలిటీ, సుస్థిరతలను ప్రధానంగా రాజధానిని రూపొందించారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీఐఎస్, ఫార్మాస్యూటికల్ కంపెనీల కారణంగా అమరావతి కమర్షియల్ హబ్గా అవతరించనుంది.