సినిమా చాన్స్ రాలేదని ఇంటికి వెళ్లలేక లాడ్జిలో గాయకుడి ఆత్మహత్య
కాకినాడ: సినిమా అవకాశం రాలేదని ఓ గాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ముఖం చూపించలేనంటూ ఆ యువకుడు ఓ లాడ్జిలో ఉరేసుకుని మరణించాడు. సినిమాల్లో గాయకుడు కావాలని అతను కలలు కన్నాడు. దాంతో చదువును నిర్లక్ష్యం చేశాడు.
అటు సినిమాల్లో పాటలు పాడే అవకాశం రాక, ఇటు చదువూ కొనసాగించలేక అతను ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నానికి చెందిన మందారపు వెంకట్రాజు (24) ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అతని తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, శ్రీనివాస్ కౌలు వ్యవసా ంచేస్తున్నారు. రెండెకరాల పొలం సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
పెద్ద కుమారుడు హైదరాబాదులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు వెంకట్రాజు చదువు కోసమంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుంటూ వస్తున్నాడు. సినిమాల్లో పాటలు పాడాలనే కోరికతో హైదరాబాద్, చెన్నై చక్కర్లు కొడుతూ వచ్చాడు.

అతనికి సినిమాల్లో అవకాశం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన వెంకట్రాజు ఈ నెల 18వ తేదీన పెద్దాపురంలోని లాడ్డిలో గది అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల అద్దె ముందుగా చెల్లించాడు. ఎక్కువ రోజులు ఉండడంతో అద్దె తర్వాత ఇస్తానని చెప్పాడు.
ఆ క్రమంలో గురువారం నుంచి అతను గది తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జిసిబ్బంది సాయంత్రం కిటికీ నుంచి గదిలోకి చూశారు. ఫ్యాన్కు వెంకట్రాజు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. ఇంటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను అందులో రాశాడు.












Click it and Unblock the Notifications