తిరుమల లడ్డూ వివాదం, కొండ మీదకు సిట్ ఎంట్రీ, ఆ ఉద్యోగులు ఎవరు?
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు తయారు చెయ్యడానికి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి ఉపయోగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న గత టీటీడీ పాలకమండలిపై, సంబంధిత టీటీడీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై నిజానిజాలు వెలుగు తీయడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను (సిట్) ఏర్పాటు చేసింది సిట్ దర్యాప్తు చీప్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసే బాధ్యతలను స్వీకరించిన సర్వశ్రేష్ట త్రిపాఠి, ఆయన బృందం శనివారం మధ్యాహ్నం తిరుమల చేరుకుంటుంది. ఇదే సమయంలో టీటీడీ ఈవో శ్యామల రావుతో సిట్ ప్రత్యేక బృందం భేటీ కానుంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ డిప్యూటీ ఈవోల నుంచి సిట్ అధికారులు వివరాలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.
తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం ఆహార పదార్థాలు ఉపయోగించారని, గతంలో తాము ఎన్నిసార్లు చెప్పినా పై అధికారులు పట్టించుకోలేదని లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో ఆ విషయంపై సిట్ బృందం దృష్టి సారించిందని తెలిసింది.

శ్రీవారి ఆలయం లడ్డు ఫోటులో పనిచేస్తున్న ఉద్యోగులు, నెయ్యి, జీడిపప్పు, యాలుకలతో పాటు లడ్డూ తయారు చెయ్యడానికి ఉపయోగించే ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్న గౌడన్లకు గతంలో ఇన్ చార్జ్ లుగా పని చేసిన టీటీడీ అధికారులు, స్టోర్ కీపర్లను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిట్ అధినేత సర్వశ్రేష్ట త్రిపాఠి నిర్ణయించారని తెలిసింది. మొత్తంమీద సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అని శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications