మోడీపై చంద్రబాబు రివర్స్ గేర్, అసలు విషయం చెప్పిన జగన్!
నోట్ల రద్దు క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు చూశారని, జనాలు ఇబ్బంది పడుతుండటంతో ఆ తర్వాత కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసిపి అధినేత జగన్ అన్నారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.500, రూ.1000 నోట్ల రద్దును స్వాగతించారు. ఆ తర్వాత ఏటీఎంలు, బ్యాంకుల వద్ద జనాల క్యూ, రోజువారీ అవసరాల కోసం ప్రజల పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ల రద్దును ప్రకటించి రెండు వారాలు గడిచినా ఇంకా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. వెంటనే చంద్రబాబు దానిని ప్రశంసించారు. తాను మొదటి నుంచి నోట్ల రద్దు కోసం డిమాండ్ చేస్తున్నానని, ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశానని చెప్పారు. అయితే, ప్రజల ఇబ్బందుల పైన మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్.. చంద్రబాబు నోట్ల రద్దును స్వాగతించడాన్ని, ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని బుధవారం ప్రస్తావించారు. తొలుత మోడీని పొగిడారని, ఇప్పుడు తిడుతున్నారని జగన్ ఎద్దేవా చేసారు. చంద్రబాబు అలా ఎందుకు చేశారో కూడా ఆయన చెప్పారు.
నోట్ల రద్దుతో క్రెడిట్ వస్తే తనకు దక్కాలని చంద్రబాబు దానిని స్వాగతించడంతో పాటు, రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు రద్దు చేయాలని నేను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారని, తద్వారా క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు.
అయితే, ఆ తర్వాత జనాలు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే, తిట్టుకుంటుంటే తన పైకి రావొద్దని ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. తనకు క్రెడిట్ రావాలని నిన్న పొగిడారని, జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు అదే మోడీపై అసంతృంతృప్తి వ్యక్తం చేశారని అభిప్రాయపడ్డారు.