ఆపరేషన్ గరుడ ఆగలేదు, పవన్ అడుగుతున్నారు కానీ చిరంజీవి ఎలా వచ్చారు: శివాజీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష వేదికపై సినీ నటుడు శివాజీ మాట్లాడారు. కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఆందోళన చేద్దామని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి ఊరిలో రైలు ట్రాక్పై కూర్చొని ఆందోళన చేద్దామని, రైల్వే కేసులు వద్దనుకుంటే ప్రతి ఊరిలో ఎర్ర జెండా పాతితే రైళ్లు ఆగిపోతాయని చెప్పారు. ఆపరేషన్ గరుడ ఇంకా ఆగలేదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా 33వేల ఎకరాలు త్యాగం చేశారన్నారు. మీ త్యాగం వృధా కాదన్నారు. అమరావతి గొప్ప రాజధాని అవుతుందన్నారు.
అక్కడకెళ్లి చెప్తావా?: బాబు దుమ్ముదులిపిన కృష్ణంరాజు, శ్రీరెడ్డి ఇష్యూపై స్పందన
రాజధాని పైన కుట్రతో చేసే వారి ఆరోపణలను రైతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 75 వేల ఎకరాల్లో నయా రాయపూర్ను నిర్మించారని చెప్పారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఏం చేశారని, రాజధానికి అన్ని ఎకరాలు అవసరమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని, కానీ అభివృద్ధి అంతటా జరుగుతోందన్నారు. మద్రాస్ లాంటి గొప్ప రాజధాని ఉండటం వల్లే ఎన్టీఆర్ గొప్ప నటుడు అయ్యారన్నారు. చిరంజీవి మెగాస్టార్ అయ్యారన్నారు.
ఏం ఇచ్చారని వీళ్లు అందరూ మద్రాస్ వెళ్లారని, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ నెల 30వ తేదీన అన్ని విషయాలు చెబుతానని అన్నారు.