కేశవరావు సహా ఆరుగురు రాజ్యసభకు ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల ఓట్లతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవ రావు రాజ్యసభ ఎన్నికల్లో గట్టెక్కారు. ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెరాసకు 17 మంది శాసనసభ్యులు ఉండగా, ఆయనకు 26 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనకు ఓటేశారు.
కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం ఆరుగురి ఎన్నిక లాంఛనప్రాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చివరకు తన ప్రథమ ప్రాధాన్యం ఓటును కెవిపి రామచందర్ రావుకు వేశారు. కాంగ్రెసు అభ్యర్థులు కెవిపి రామచందర్ రావు, టి. సుబ్బిరామిరెడ్డి, ఖాన్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి కూడా విజయం సాధించారు.
ప్రథమ ప్రాధాన్యం ఓట్లు కెవిపికి 46 రాగా, సుబ్బిరామరెడ్డికి, ఖాన్కు 49 లెక్కన వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థుల్లో గరికపాటికి 36 ఓట్లు రాగా, సీతా రామలక్ష్మికి 38 ఓట్లు వచ్చాయి. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది.
248 మంది శాసనసభ్యులు ఓటు చేయగా, నాలుగు ఓట్లు చెల్లలేదు. ఓ ఓటు తిరస్కరణక గురైంది. హనుమంత్ షిండే, విద్యాసాగర్, జెసి దివాకర్ రెడ్డి, గంగుల కమలాకర్ ఓట్లను లెక్కించవద్దని, వారు అందరికీ చూపించి ఓటేసినందు వల్ల లెక్కించవద్దని తెలుగుదేశం పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కెకె కృతజ్ఝతలు తెలిపారు. తెలంగాణ బిల్లును మంత్రివర్గం ఆమోదించడం, తాను గెలవడం ఒకేసారి జరిగాయని, అందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కాకుండా నవ తెలంగాణ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.