ఏపీలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం: ఆక్సిజన్ లేక ఆరుగురు కరోనా రోగులు మృతి, విచారణకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు: కరోనా మహమ్మారి కాటేస్తున్నవేళ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు తమ స్వార్థం కోసం బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా నుంచి రోగులను సురక్షితంగా బయటపడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తుంటే.. మరికొంత మంది మాత్రం డబ్బుల కోసం రోగుల ప్రాణాలు తీస్తున్నారు. కర్నూలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యంతో ఆరుగురు మృతి
కర్నూలు జిల్లా కేంద్రంలోని కేఎస్ కేర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు కరోనా రోగులు మరణించారు. కరోనా వైద్యం చేసేందుకు ఎలాంటి అనుమతి లేకపోయినప్పటికీ ఈ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన చికిత్స, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిశాయి.

ఆస్పత్రి నుంచి పరారైన వైద్య సిబ్బంది..
రోగులు మృతి చెందడంతో కేఎస్ కేర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆస్పత్రి నుంచి పారిపోవడం గమనార్హం. దీంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కరోనాకు చికిత్స చేస్తామని చెప్పి.. తమవారి ప్రాణాలు తీశారంటూ ఆస్పత్రి యాజమాన్యంపై మండిపడుతున్నారు.
ఆరుగురు మృతి చెందడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. కేఎస్ కేర్ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేదని, రోగులే ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించుకుంటున్నట్లు తెలిసిందన్నారు. రోగుల మృతిపై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరెందుకు ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులో లేరని వైద్యాధికారులు తెలిపారు.

ఆస్పత్రికి వస్తూ కారులోనే రోగి మృతి
ఇది ఇలావుండగా, కర్నూలు ఆస్పత్రికి కారులో బయల్దేరిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన పాములపాడు మండల పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామానికి చెందిన అనిల్ కుమార్(46) ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆస్పత్రికి కారులో ఒంటరిగా బయల్దేరారు. బానుముక్కల మలుపురాగానే కారును పక్కకు నిలిపివేశారు.
ఆ తర్వాత కారు ఎంతసేపటికీ అక్కడ్నుంచి కదలకపోవడంతో సమీపంలోని టీకొట్టు యజమాని వచ్చి చూడగా.. స్పృహకోల్పోయి పడివున్నాడు. దీంతో అనిల్ వద్ద ఉన్న ఫోన్ తీసుకుని అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. దీంతో మృతుడి తమ్ముడు, భార్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అనిల్ మృతి చెందివుండటంతో బోరునవిలపించారు. గుండెపోటు వచ్చి మరణించివుంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

విచారణకు ఆదేశించిన కలెక్టర్ వీరపాండ్యన్
కర్నూలులోని కేఎస్ కేర్ కోవిడ్ సెంటర్లో ఆక్సిజన్ అందరక ఐదుగురు చనిపోయిన ఘటనపై కలెక్టర్ వీరపాండ్యన్ వెంటనే స్పందించారు. ఆ కోవిడ్ సెంటర్కు ప్రభుత్వ అనుమతులు లేవని గుర్తించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్వోను ఆయన ఆదేశించారు.కేఎస్కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్లో కర్నూలు జీజీహెచ్కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్లను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.












Click it and Unblock the Notifications