సచివాలయంలో నకిలీ ఇంటర్వ్యూ! పరారీలో టీ ఉద్యోగి
హైదరాబాద్: సచివాలయంలో ఉద్యోగాలు ఉన్నాయంటూ నిరుద్యోగులకు మోసం చేస్తున్న ఆరుగురిని హైదరాబాదు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేసారు. నిందితులకు సహకరించిన తెలంగాణ సచివాలయ ఉద్యోగి పరారీలో ఉన్నారని అదనపు సీపీ(నేరాలు) స్వాతి లక్రా ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధాన నిందితుడు అశోక్తో పాటు మరో ఐదుగురు సభ్యులను అరెస్టు చేసి శనివారం కటకటాల్లోకి నెట్టారు. మరో ప్రధాన నిందితుడు, సచివాలయ ఉద్యోగి రంగబాబు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.3.20 లక్షలతో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజాం కాలేజీలో అటెండర్గా పని చేస్తున్న అశోక్, ప్రైవేటు ఉద్యోగులు ఎం రమేష్, శివ ప్రసాద్, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిటి స్కాన్ టెక్నీషియన్ బి సుధాకర్, వార్తాలోకం పత్రిక విలేకర్లు వై చంద్రకాంత్ గౌడ్, కె నాగరాజులు సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.
తెలంగాణ ఆర్థిక శాఖలో జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలని పథకం రచించారు. డబ్బు తీసుకున్న తర్వాత సచివాలయంలో పని చేసే రంగబాబు అనే వ్యక్తి ద్వారా వారిని ఏదో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేర్పించాలని పన్నాగం పన్నారు.

అనుకున్నదే తడవుగా ఎండి మునీరుద్దీన్, ఇ శ్రీనివాస రెడ్డి, కె జోత్న్సరెడ్డి, ఎం కిషోర్ అనే నిరుద్యోగులను నమ్మించారు. వారిలో మునీరుద్దీన్ నుంచి రూ.4.50 లక్షలు, మిగతా ఇద్దరి నుంచి చెరో రూ.1.50 లక్షలు వసూలు చేశారు. అనంతరం గత నెల 12న సచివాలయంలోని డి-బ్లాక్లో రంగబాబు సీనియర్ అసిస్టెంట్గా పరిచయం చేసుకుని ముగ్గురిని ఇంటర్వ్యూ చేశాడు.
ముగ్గురు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికయ్యారని నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత రంగబాబు సీనియర్ అసిస్టెంట్ పేరుతో సంతకం చేసి ముగ్గురికి నియామక పత్రాలు అందించాడు. ఇవి కన్ఫర్మేషన్ లెటర్లని, అపాయింట్మెంట్ ఆర్డర్ తర్వాత అందుతుందని నమ్మబలికాడు.
రంగబాబు ఇచ్చిన ఆ లెటర్లో జూనియర్ అసిస్టెంట్కు బదులు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అని ఉండడంతో బాధితులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో బాధితుడు మునీరుద్దీన్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రంగబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications