విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆరు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వాణిజ్య వ్యాపారంలో భాగంగా జపాన్, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదేవిధంగా దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో తూర్పు-పశ్చిమ రవాణా కారిడార్కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ స్మారకార్థం బీహార్లో స్తూపం నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖపట్నంతోపాటు బుద్ధగయా(బీహార్), సిర్మౌర్(హిమాచలప్రదేశ్), నాగపూర్(మహారాష్ట్ర), సంబల్పూర్(ఒడిశా), అమృత్సర్(పంజాబ్)లలో ఐఐఎంల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.