పది కుక్కల మూకుమ్మడి దాడి: చిన్నారి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని కాకుమానులో కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఆరేళ్ల చిన్నారిపై పది కుక్కలు మూకుమ్మడి దాడి చేసి కరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన కాకుమానులో విషాదాన్ని నింపింది.
ఇంటి నుంచి స్నానానికి వెళ్తున్న బాలికపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దాంతో పాప పొట్టలోని పేగులు బయటకు వచ్చాయి. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఓ బాలికపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
కుక్కలు దాడి వల్ల బాలిక మరణించిందనే వార్త తెలుసుకున్న ప్రజలు వచ్చి మండిపడ్డారు. రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా పెద్ద యెత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. కుక్కలు ద్విచక్రవాహనాలపై వచ్చేవారిపై, పాదచారులపై తరుచుగా దాడి చేస్తున్నాయి.
కుక్కల బెడదను నివారించడానికి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని, అధికారులు వచ్చి కుక్కల బెడదకు తీసుకునే నిర్దిష్టమైన చర్యలకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు. కుక్కల బెడదల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి రావెల కిశోర్ బాబు అధికారులను ఆదేశించారు.