ఎసిబి వలలో ఎస్కే యూనివర్శిటీ సహాయ రిజిస్ట్రార్
అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సహాయ రిజిస్ట్రార్ గుళ్లపల్లి వెంకటస్వామి రాజమండ్రిలో ఎసిబికి చిక్కారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రతినిధి నుంచి రూ.50 వేలు ల
అమరావతి: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సహాయ రిజిస్ట్రార్ గుళ్లపల్లి వెంకటస్వామి రాజమండ్రిలో ఎసిబికి చిక్కారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రతినిధి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్ధుల పరీక్షల హాజరుకు సంబంధించి ఎస్కే యూనివర్శిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా ఏసీబీ డీఎస్పీ సుధాకర్ దాడి వివరాలు మీడియాకు తెలిపారు. అనకాపల్లి ఎంఎస్ఆర్ నేషనల్ డిగ్రీ కాలేజీలోని స్టడీ సెంటర్ ద్వారా 300 మంది విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చదువుతున్నారు.
అందులో భాగంగా జనవరిలో పరీక్షలు రాసి ప్రాక్టికల్స్ కు కూడా హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్ ఎగ్సామ్స్ కు మీ విద్యార్ధులు ఎవరూ హాజరుకాలేదంటూ మార్కుల జాబితాలో ఖాళీగా ఉంచారు. దీంతో ఎంఎస్ఆర్ స్టడీ సెంటర్ ప్రతినిధి అచ్చయ్యనాయుడు అనంతపురం వెళ్లి విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల మార్కులకు సంబంధించి జరిగిన పొరపాటును సరిచేయాలని కోరారు.
ఈక్రమంలో వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుళ్లపల్లి వెంకటస్వామి రంగంలోకి దిగి జాబితాను తాను సరిచేయిస్తానని, దీనికిగాను రూ.లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని కోరారు. అయితే అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని ఎంఎస్ఆర్ స్టడీ సెంటర్ ప్రతినిధి అచ్చయ్యనాయుడు చెప్పారు. అయితే అడిగినంత ఇస్తేనే కాని పని జరుగుతుందని వెంకటస్వామి స్పష్టం చేశారు.
దీంతో లక్ష రూపాయలను రెండు విడతలుగా ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో శనివారం రాజమహేంద్రవరం కోరుకొండలోని అరవాలమ్మ కాలేజీలో పరీక్షలు నిర్వహించేందుకు వస్తున్నామని , అక్కడకు వచ్చి డబ్బులు ఇవ్వాలని అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి ఫోన్ చేసి అచ్చయ్యనాయుడుకు చెప్పారు. దీంతో అచ్చయ్యనాయుడుకు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో డిఎస్పీ సుధాకర్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో అచ్చయ్యనాయుడు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటస్వామి ఎస్కే యూనివర్శిటీలో లో అటెండర్గా ప్రస్థానం ప్రారంభించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. మరో నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం ఏసీబీ అధికారులు ఆకుతోటపల్లిలోని వెంకటస్వామి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.