జగన్ అక్రమాస్తుల కేసు, ప్రతాప్ రెడ్డికి ఊరట: అభియోగాలకు ఆధారాల్లేవు, ఆ సెక్షన్ కింద విచారణకు నో!
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టులో చుక్కెదురైంది. అయితే పెన్నా ప్రతాప్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కేసు కొట్టేయాలని పెన్నా గ్రూప్ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పెన్నా ప్రతాప్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను మాత్రం తొలగించింది.
పెన్నా ప్రతాప్ రెడ్డికి ఊరట, కానీ
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పెన్నా ప్రతాప్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయనకు హైకోర్టు కొంత ఊరటను ఇచ్చింది. అతనిపై ఉన్న అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 12 కింద సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఐపీసీ సెక్షన్ 120(బీ), 420 కింద ఉన్న కేసులు కొనసాగుతాయని తెలిపింది. వీటిపై విచారణ చేపట్టేందుకు సీబీఐకు అనుమతించింది. డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోడానికి అనుమతించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను అనుమతించారు.
అభియోగాలకు ఆధారాల్లేవు.. విచారణ వద్దని తీర్పు
జగన్ కేసు వ్యవహారంలో భాగంగా పెన్నా గ్రూప్ కంపెనీలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పెన్నా గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డితో పాటు పెన్నా సిమెంట్స్, పిఆర్ ఎనర్జీ హోల్డింగ్స్, పయోనీర్ హోల్డింగ్స్, పెన్నా తాండూర్ సిమెంట్స్లు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సత్యనారాయణమూర్తి వాదనల అనంతరం 158 పేజీల తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం కింద ప్రతాప్ రెడ్డిపై అభియోగాలకు ఆధారాలులేవని, ఆ సెక్షన్ కింద విచారణ చేపట్టరాదంటూ తీర్పు ఇచ్చారు.
క్విడ్ ప్రోకో చట్టంలో లేకపోయినప్పటికీ
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ప్రకారం ప్రభుత్వానికి రూ.1028 కోట్ల నష్టం చూపగా అందులో పిటిషనర్లకు చెందిన రూ.68 కోట్లు ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. చట్టం ప్రక్రియ దుర్వినియోగం అయినప్పుడు మాత్రమే హైకోర్టులు తమ ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రత్యేక ఆధారాలతో కేసును కొట్టివేయలేమని చెప్పారు. అనంతపురం జిల్లాలో 231 ఎకరాల కేటాయింపు చట్ట ప్రకారం జరగలేదని, కేటాయింపు అనంతరం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయంటే క్విడ్ ప్రోకోలో భాగమేనని పేర్కొన్నారు. కర్నూలులో 304 హెక్టార్ల లీజులో వాంగ్మూలాలను సూక్ష్మంగా పరిశీలించకుండా ప్రాథమికంగా ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. క్విడ్ ప్రోకో మన క్రిమినల్ చట్టంలో లేకపోయినప్పటికీ అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వ కేటాయింపులు చేసి లబ్ధిదారుల నుంచి పాలకుల కుటుంబ సభ్యులు పొందడం చట్ట విరుద్ధమేనన్నారు.